టాటా, ల్యాండర్ రోవర్ సంస్థల నుంచి ప్రీమియం ఎస్యూవీ
టాటా సుమో, టాటా సఫారీ వంటి పాపులర్ పవర్ఫుల్ ఎస్యూవీలను విక్రయిస్తున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇప్పుడు లగ్జరీ ఎస్యూవీలపై కన్నేసింది. ప్రత్యేకించి భారత్ మార్కెట్ను టార్గెట్గా చేసుకొని టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి ప్రీమియం ఎస్యూవీలకు పోటీగా కంపెనీ ఓ ప్రీమియం ఎస్యూవీని అభివృద్ధి చేస్తోంది.
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ యొక్క కొత్త మోడల్ ఫ్యామిల్ స్ట్రాటజీలో భాగంగా, ఫ్రీల్యాండర్ 2 లగ్జరీ ఎస్యూవీ పేరులో ఫ్రీల్యాండర్ను తీసివేసి, డిస్కవరీ పేరును చేర్చనున్నారు. అంతేకాకుండా, ఈ కొత్త డిస్కవరీ మోడల్ కోసం రేంజ్ రోవర్ ఎవోక్ యొక్క మోడిఫైడ్ వెర్షన్ను ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో, కంపెనీ నిలిపివేయాలనుకున్న ఫ్రీల్యాండర్ 2 ప్లాట్ఫామ్ను టాటా మోటార్స్ అభివృద్ధి చేయాలనుకున్న ప్రీమియం ఎస్యూవీ కోసం ఉపయోగించే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

సుమారు రూ.20-25 లక్షల రేంజ్లో టాటా మోటార్స్ ఈ ప్రీమియం ఎస్యూవీని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఫ్రీల్యాండర్ 2 మోడల్ది ఎల్359 ప్లాట్ఫామ్ మరియు ఇదొక మోనోకాక్ ఛాస్సిస్ నిర్మాణాన్ని కలిగినది. మోనోకాక్ ఛాస్సిస్ కలిగిన ఎస్యూవీలు బరువు తక్కువగా ఉండి, మంచి పెర్ఫార్మెన్స్ను, మెరుగైన మైలేజీనిచ్చేందుకు సహకరిస్తాయి.
ఇది కూడా చదవండి: మేడ్ ఇన్ ఇండియా ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 విడుదల
టాటా మోటార్స్ బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ను స్వాధీనం చేసుకొని దాదాపు 6 ఏళ్లు పూర్తయినప్పటికీ, జెఎల్ఆర్ నుంచి టాటా ఇప్పటి వరకు ఎలాంటి పూర్తి సాంకేతిక సహాయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో, మొట్టమొదటి సారిగా ఈ రెండు సంస్థల సాంకేతిక సహకారంతో రానున్న ఈ సరికొత్త టాటా ప్రీమియం ఎస్యూవీపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వాస్తవానికి టాటా మోటార్స్ ప్రీమియం ఎస్యూవీ కోసం ఫ్రీల్యాండ్ 2 ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుంటున్నప్పటికీ, ఇది ప్రస్తుత తరం ఫ్రీల్యాండర్ కన్నా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ, నాణ్యత విషయంలో మాత్రం ఇది ఫ్రీల్యాండ్ మాదిరిగానే ధృడంగా ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా కార్ల కన్నా మంచి అప్మార్కెట్ ఫీల్నిచ్చేలా ఈ కొత్త ఎస్యూవీని తీర్చిదిద్దనున్నారు.
కొత్త టాటా ప్రీమియం ఎస్యూవీ కోసం ఫ్రీల్యాండర్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొన్నప్పటికీ, ఇంజన్ను మాత్రం టాటాదే ఉపయోగించనున్నారు. ప్రస్తుతం టాటా మోటార్స్ విక్రయిస్తున్న ఆరియా, సఫారీ స్టోర్మ్లలో ఉపయోగిస్తున్న 2.2 లీటర్ వేరికార్ డీజిల్ ఇంజన్నే ఈ కొత్త ప్రీమియం ఎస్యూవీలోను ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, ఈ ఇంజన్ ట్యూనింగ్లో కొంచెం మార్పులు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఎన్ఏతో వస్తున్న ఈ టాటా ప్రీమియం ఎస్యూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రెండేళ్ల వేచి చూడక తప్పదు. ఇది 2016-17 నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








