ఏ3 ఎంట్రీ లెవల్ లగ్జరీ కారును విడుదల చేయనున్న ఆడి
భారత్లో విలాసవంతమైన కార్లను విక్రయిస్తున్న జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఆడి తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు 'ఆడి ఏ3' సెడాన్ను ఇండియాకు తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి ఈ మోడల్ను మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోందని ఆడి గ్రూప్ సీఈఓ రూపెర్ట్ స్టాడ్లర్ తెలిపారు.
ఆడి ఏ3 సెడాన్ను సరసమైన ధరకే భారత్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను, ఈ కారును ఔరంగాబాద్ ప్లాంటులోనే అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చవక లగ్జరీ కారు అధిక సంఖ్యలో అమ్ముడుపోయి, కంపెనీ వృద్ధికి చక్కగా దోహదపడగలదని రూపెర్ట్ స్టాడ్లర్ వెల్లడించారు.

ఆడి ఏ3 లగ్జరీ సెడాన్ కార్లను ఉత్తత్తి చేయగల అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటని, ఆడి ఎ3 సెడాన్ను ఇప్పటికే యూరప్లోని కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉండగా, వచ్చే నెలలో దీనిని యూఎస్ మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.
లగ్జరీ కార్ల సెగ్మెంట్లో భారత మార్కెట్ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనదని, రూపాయి ఒడిదొడుకులు కారణంగా తమ సంస్థ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ఈ ఎన్నికల తర్వాత ఆర్థిక సంస్కరణల కోసం వేచిచూస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం చేపట్టబోయే పన్ను విధానంపై దృష్టిసారించామని స్టాడ్లర్ చెప్పారు.

ఆడి ఇండియా ఇప్పటికే ఔరంగాబాద్ ప్లాంటులో ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 మోడళ్లను అసెంబ్లింగ్ చేస్తోంది. 2007 నుంచి ఇప్పటి వరకు ఆడి ఇండియా ఈ ప్లాంటులో మొత్తం 27,000 లకు పైగా వాహనాలను అసెంబ్లింగ్ చేసింది. గడచిన సంవత్సరంలో (2013లో) ఆడి ఇండియా దేశీయ విపణిలో 11 శాతం వృద్ధిని నమోదుచేసింది. దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో 10,000 లకు పైగా లగ్జరీ కార్లను విక్రయించిన ఏకైక జర్మన్ లగ్జరీ బ్రాండ్గా ఆడి నిలిచింది.


Click it and Unblock the Notifications








