అనుకున్న సమయం కన్నా ముందే రానున్న డాట్సన్ 3వ కార్
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్కి చెందిన బడ్జెట్ కార్ బ్రాండ్ డాట్సన్, భారత మార్కెట్లో తమ మూడవ ఉత్పత్తి విడుదల చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. డాట్సన్ గడచిన వారమే తమ గో ప్లస్ ఎమ్పివిని మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.
నిస్సాన్ ఇండియా ఈ ఏడాది చివరి నాటికి 10 శాతం మార్కెట్ వాటా దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. కంపెనీ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, డాట్సన్ బ్రాండ్ అమ్మకాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే, మరిన్ని చిన్న పట్టణాల్లో డాట్సన్ నెట్వర్క్ను విస్తరించే దిశగా కంపెనీ చర్యలు చేపట్టింది.

అంతేకాకుండా.. డాట్సన్ బ్రాండ్లో పరిచయం చేయాలనుకున్న మూడవ ఉత్పత్తిని కూడా అనుకున్న సమయం కంటే ముందుగానే విడుదల చేయాలని యోచిస్తోంది. గడచిన ఫిబ్రవరి 2014లో జరిగిన ఆటో ఎక్స్పోలో డాట్సన్ ప్రదర్శనకు ఉంచిన 'రెడీ గో' కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని కంపెనీ తమ మూడవ మోడల్ను తయారు చేసే ఆస్కారం ఉంది.
డాట్సన్ రెడీ గో మోడల్ను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న గో హ్యాచ్బ్యాక్కు దిగువన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ వంటి మోడళ్లకు పోటీగా ఉండేలా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఈ చిన్న కారు ధర రూ.2-3 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ని గమనిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications








