ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుందా?
ఫోర్డ్ ఇండియా నుంచి అత్యంత పాపులర్ అయిన ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ వెయిటింగ్ పీరియడ్ త్వరలోనే భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక మార్కెట్ నుంచి అలాగే విదేశీ మార్కెట్ల నుంచి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వాహనాలను సరఫరా చేసేందుకు గాను, ఫోర్డ్ ఇండియా తమ చెన్నై ప్లాంట్లో 24 గంటల పాటు ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ ఏడాది ద్వితీయార్థం (జులై 2014) నుంచి చెన్నై ప్లాంటులో మూడు షిఫ్టులను ప్రారంభిచనున్నారు. భారత్లో ఫోర్డ్ 17 ఏళ్ల చరిత్రలో 24 గంటల పాటు ఉత్పత్తిని నిర్వహించడం ఇదే మొదటిసారి కానుంది. ఈ ప్లాంట్లో మూడు షిఫ్టులను ప్రారంభించడం ద్వారా కంపెనీ సాలీనా 1,60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని సన్నాహాలు చేస్తుంది. వెండర్ల మద్ధతుతో ఈ సామర్థ్యాన్ని క్రమేనా 2,00,000 యూనిట్లకు తీసుకువెళ్లాలనేది కంపెనీ ప్రధాన లక్ష్యం.

ఫోర్డ్ ప్రస్తుతం రోజుకు 350 ఈకోస్పోర్ట్ వాహనాలను తయారు చేస్తోంది. జూన్ నాటికి ఈ సంఖ్యను రోజుకు 450 యూనిట్లకు తీసుకువెళ్లేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అలాగే, యూరప్ మరియు జపాన్ దేశాల నుంచి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వచ్చే అక్టోబర్ నాటికి రోజుకు 750 నుంచి 850 యూనిట్ల ఈకోస్పోర్ట్ ఎస్యూవీలను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








