ఇంజన్లో సమస్య: 3072 ఫోర్డ్ ఫియస్టా సెడాన్లు వెనక్కి
భారదతేశంలో వాహనాల రీకాల్కు సంబంధించి ఓ నిర్ధిష్టమైన కోడ్ను అమల్లోకి తెచ్చినప్పటి నుంచి కార్ కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రీకాల్ను ప్రకటిస్తున్నాయి. ఇటీవలే దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా తమ ఎక్స్యూవీ500, స్కార్పియో, జైలో మోడళ్లలోని ఇంజన్ వాక్యూమ్ పంప్ సమస్య కారణంగా రీకాల్ చేసిన సంగతి మరువక ముందే, మరో ఆటో దిగ్గజం ఫోర్డ్ తమ ఫియస్టా కార్లను రీకాల్ చేసింది.
అక్టోబర్ 2010 నుంచి డిసెంబర్ 2011 మధ్యలో ఉత్పత్తి అయిన ఫోర్డ్ ఫియస్టా సెడాన్లలోని డీజిల్ ఇంజన్ స్టారింగ్లో ఉపయోగించిన భాగాలను రీప్లేస్ చేసేందుకు గాను ఫోర్డ్ ఇండియా మొత్తం 3072 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 3,072 యూనిట్ల ఫోర్డ్ ఫియస్టా టిడిసిఐ వాహనాలపై ఉత్పత్తి సంబంధిత దిద్దుబాటు చర్యల కోసం ఫీల్డ్ సప్వీస్ను జారీ చేశామని ఫోర్డ్ ఇండియా తమ ప్రకటనలో పేర్కొంది.

ఈ విషయానికి సంబంధించి తాము తమ కస్టమర్లను సంప్రదిస్తున్నామని, స్థానిక ఫోర్డ్ డీలర్ను సంప్రదించిన ఫియస్టా కారు యజమానులకు తమ కార్లలో కొత్త డిజైన్, వాటర్ప్రూఫ్తో కూడిన గ్లో ప్లగ్ కంట్రోల్ మాడ్యూల్ని ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ తెలిపింది. వినియోగదారుల భద్రత, సంతృప్తి కోసం ఈ వాలంటరీ రీకాల్ను ప్రకటిస్తున్నామని కంపెనీ తెలిపింది.
ఈ సమస్య వలన ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు సంభవించలేదని ఫోర్డ్ ఇండియా స్పష్టం చేసింది. డీజిల్ ఇంజన్లను స్టార్ట్ చేసేందుకు సహకరించే గాను ఉష్ణాన్ని అందించే గ్లో ప్లగ్ కంట్రోల్ యూనిట్ని కంట్రోల్ చేసే మాడ్యూల్ ఇదని కంపెనీ వివరించింది.
ఇదివరకు టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ తమ క్యామ్రీ సెడాన్లోని ఫ్రంట్ సస్పెన్షన్ సమస్య కారణంగా 119 యూనిట్ల క్యామ్రీ కార్లను, అలాగే ఆడి ఇండియా తమ ఏ4 సెడాన్లోని ఎయిర్బ్యాగ్ కంట్రోల్ యూనిట్ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేసేందుకు 6,758 ఏ4 కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








