ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ను తగ్గించనున్న ఫోర్డ్
ఫోర్డ్ ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్యూవీ ఈకోస్పోర్ట్ భారత మార్కెట్లో ఇప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న సంగతి తెలిసినదే. ఈ మోడల్ ఉత్పత్తికి మించి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో, కంపెనీ డీలర్లు సరైన సమయంలో వీటిని కస్టమర్లకు అందజేయలేకపోతున్నారు. ఈకోస్పోర్ట్ విషయంలో సుధీర్ఘ వెయిటింగ్ పీరియడ్ పట్ల అసంతృప్తి చెందిన కొందరు కస్టమర్లు ఇతర మోడళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఫోర్డ్ ఇండియా తమ పాపులర్ ఈకోస్పోర్ట్ ఎస్యూవీ వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు గాను సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా, చెన్నై ప్లాంట్లో ఈకోస్పోర్ట్ ఉత్పత్తి కోసం కంపెనీ మూడవ షిఫ్టును ప్రారంభించింది. ఈ ప్లాంటులో అదనపు షిఫ్టును ప్రారంభించడం వలన ఈకోస్పోర్ట్ ఉత్పత్తి పెరిగి, ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ తగ్గే ఆస్కారం ఉందని కంపెనీ భావిస్తోంది.

దాదాపు ఏడాది క్రితం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ భారత మార్కెట్లో విడుదలైంది. ప్రస్తుతం ఈ మోడల్ కోసం కస్టమర్లు 4-6 నెలల వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో, ఈ మోడల్కు లభిస్తున్న అధిక డిమాండ్ కారణంగా కంపెనీ దీని బుకింగ్స్ను కూడా నిలిపివేసిన సంగతి తెలిసినదే. ఏదేమైనప్పటికీ, ఈ ప్లాంటులో మూడవ షిఫ్టును ప్రారంభించడంతో ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ తగ్గే ఆస్కారం కనిపిస్తోంది.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్లో బేస్ వేరియంట్స్ కన్నా టాప్-ఎండ్ వేరియంట్స్కే ఎక్కువ డిమాండ్ లభిస్తున్నట్లు ఫోర్డ్ అధికారులు వెల్లడించారు. మిడ్-ఎండ్ వేరియంట్లకు మరియు ఈకోబూస్ట్ వేరియంట్కు కూడా స్పందన లభిస్తోందని వారు తెలిపారు. భారత్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మూడు ఇంజన్ వేరియంట్లలో (1.5 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్) లభ్యమవుతోంది.


Click it and Unblock the Notifications








