2016లో బ్యాటరీతో నడిచే కార్లను విడుదల చేయనున్న హ్యుందాయ్
ప్యాసింజర్ కార్ల తయారీలో అగ్రగామి అయిన కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం ఇప్పుడు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించింది. 2016లో తమ తొలి బ్యాటరీ పవర్డ్ కారును విడుదల చేస్తామని హ్యుందాయ్ ప్రకటించింది.
హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లీ కీ-శాంగ్ దక్షిణ కొరియాలో తమ సిస్టర్ కంపెనీ కియాకు చెందిన సౌల్ కాంపాక్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ను ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

ప్రస్తుతం పెట్రోల్/డీజిల్ కార్ల హవా కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కార్లకే మంచి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే హోండా, హ్యుందాయ్ వంటి హేమాహేమీ కంపెనీలు ఫ్యూయెల్ సెల్ మరియు ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధిపై చాలా తీవ్రంగా సన్నాహాలు చేస్తున్నాయి.
హ్యుందాయ్ ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాలను లక్ష్యంగా చేసుకొని తమ ఐఎక్స్35 రోడ్వర్తీ ఫ్యూయెల్ సెల్ కారును పరిమిత సంఖ్యలో మార్కెట్ చేస్తోంది. మరోవైపు హ్యుందాయ్ సిస్టర్ కంపెనీ కియా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉంది.

భవిష్యత్తులో ఏ ఈకో-ఫ్రెండ్లీ కార్లు విజయం సాధిస్తాయనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని, అందుకే హ్యుందాయ్ ఫ్యూయెల్ సెల్ వాహనాల అభివృద్ధిని చేస్తుండగా, కియా ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారించనుందని లీ కీ-శాంగ్ తెలిపారు.
అయితే, సమయం వచ్చినప్పుడు కియా ఓ ఫ్యూయెల్ సెల్ కారును పరిచయం చేస్తుందని, అలాగే హ్యుందాయ్ కూడా 2016లో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








