నీటితో నడిచే కారులో తిరగనున్న జపాన్ ప్రధానమంత్రి!
కాలుష్య రహిత సమాజాన్ని స్థాపించేందుకు ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ కూడా ప్రత్యామ్నాయ మరియు ప్రకృతి సాన్నిహిత్యమైన ఇంధన వనరులతో నడిచే వాహనాల తయారీపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే, జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా కూడా హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ (నీటి)తో నడిచే వాహనాన్ని అభివృద్ధి చేసింది.
కంపెనీ అందిస్తున్న టొయోటా మిరాయ్ సెడాన్లో కంపెనీ ఈ హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ ఇంధన ఆప్షన్ను పరిచయం చేసింది. అంతేకాదు, ఈ కారును పూర్తిస్థాయిలో కస్టమర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాకుండా.. టొయోటా తమ తొలి హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ మిరాయ్ సెడాన్ను జపాన్ ప్రధానమంత్రికి అధికారిక వాహనంగా బహుమతి చేసింది.
నీటితో నడిచే టొయోటా మిరాయ్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి..!

ఈనెల 15వ తేదీన టొయోటా ఓ బ్లూ కలర్ మిరాయ్ హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ కారును జపాన్ ప్రధానమంత్రి షింజో అబేకి అందజేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 'మొత్తానికి హైడ్రోజన్ శకం ప్రారంభమైందని' అన్నారు.

కేవలం జపాన్ ప్రధాన మంత్రికే కాకుండా ఆ దేశ ఆర్థిక, రవాణా మరియు పర్యావరణ మంత్రులకు కూడా టొయోటా తమ ఫ్యూయెల్-సెల్ వాహనాలను అందజేసింది.

టొయోటా గడచిన డిసెంబర్ 2014 నెలలోనే తమ హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ మిరాయ్ కోసం బుకింగ్లను స్వీకరించడం ప్రారంభించిది. ఇప్పటి వరకూ సుమారు 1500 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

నీటితో నడిచే వాహనాలను మొట్టమొదటి సారిగా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్న తొలి ఆటోమొబైల్ కంపెనీ టొయోటానే కావటం విశేషం. కాగా.. ఇప్పటికే హోండా, మెర్సిడెస్ బెంజ్ వంటి పలు కంపెనీలు తమ కార్లతో ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నాయి.

గాలిలోని ఆక్సిజెన్ మరియు హైడ్రోజెన్ మధ్య జరిగే రసాయన చర్యలో భాగంగా జనించే విద్యుత్ని ఆధారంగా చేసుకొని ఈ కారు పనిచేస్తుంది. ఇది నీటితో నడుస్తుంది కాబట్టి ఈ కారు వలన పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.

హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ వాహనాల కోసం సాధారణ నీటిని ఉపయోగించకూడదు, ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోజన్ ఫ్యూయెల్ను ఉపయోగించాల్సి ఉంటుంది. జపాన్లో ఈ ఏడాది చివరి నాటికి 100 స్థానిక హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

వాస్తవానికి టొయోటా తొలుత తమ ఫ్యూయెల్-సెల్ మిరాయ్ కోసం 2015 చివరి నాటికి 400 ఆర్డర్లు రావచ్చని అంచనా వేసింది. కానీ వాటి సంఖ్య 1500 లకు మించిపోయింది.

టొయోటా మిరాయ్ హైడ్రోజెన్ ఫ్యూయెల్-సెల్ కోసం వచ్చిన ఆర్డర్లలో 60 శాతం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేట్ కస్టమర్ల నుంచి రాగా మిగిలిన 40 శాతం సాధారణ కస్టమర్ల నుంచి వచ్చాయి.


Click it and Unblock the Notifications








