కొత్త మోటార్ బిల్: భారీ జరిమానాలు, కఠిన జైలు శిక్షలు
మోటార్ వాహన చట్టంలోని నిబంధనలు, వాటిని ఉల్లంఘించే వారిపై శిక్షలు ఇక మరింత కఠినతరం కానున్నాయి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ బిల్ను ప్రతిపాదిస్తోంది. ‘కొత్త రోడ్డు భద్రత, రవాణా బిల్లు-2014' పేరుతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం, రోడ్డు నిబంధనలు అతిక్రమించి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
మన దేశంలో ప్రతి ఏటా లక్షా యాభై వేల మందికి పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రహదారి భద్రత పెంచి, రోడ్డు ప్రమాదాలకు కారమయ్యే మరియు నిబంధనలు ఉల్లంఘించే నేరస్తులపై కొరడా జులుపించేందుకు కేంద్ర ఈ కొత్త మోటారు వాహనాల బిల్లును ప్రతిపాదించింది. ఇందులో భారీ జరిమానాలు, ఏడేళ్లకు పైగా జైలు శిక్ష, వాహనాల జప్తు, డ్రైవింగ్ లెసైన్సుల రద్దు మొదలైన శిక్షలు ఉన్నాయి.

ప్రస్తుతం ప్రభుత్వం ఈ కొత్త బిల్లు కోసం ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తోంది. ప్రజల నుంచి, సంబంధిత రంగాల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించిన తర్వాత, బిల్లును ఖరారు చేసి శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కొత్త రోడ్డు భద్రత, రవాణా బిల్లు-2014లోని ప్రతిపాదనలు ఏంటో తెలుసుకుందాం రండి.
* కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదంలో పిల్లల మృతికి కారణమైతే, సదరు ప్రమాదానికి కారణమైన వారికి రూ.3 లక్షల జరిమానా, ఏడేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష విధించనున్నారు.
* వాహనాల తయారీ డిజైన్లో లోపాలుంటే ఒక్కో వాహనానికి రూ.5 లక్షల జరిమానా, జైలుశిక్ష. వాహనాలను సురక్షితం కాని పరిస్థితుల్లో నడిపితే రూ.1 లక్షవరకు జరిమానా లేదా ఆరు నెలల నుంచి ఏడాది జైలుశిక్ష లేదా ఇవి రెండూ.
* మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే, తొలి నేరం కింద రూ.25,000 జరిమానా, లేదా మూడు నెలలకు మించని జైలుశిక్ష లేదా ఇవి రెండూ మరియు ఆరు నెలలు డ్రైవింగ్ లెసైన్స్ సస్పెన్షన్. మూడేళ్లలోపు రెండోసారి ఈ నేరానికి పాల్పడితే రూ.50,000 జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా ఇవి రెండూ. వీటితోపాటు లెసైన్స్ ఏడాది సస్పెన్షన్. తర్వాత కూడా డ్రంక్ డ్రైవింగ్ చేస్తే లెసైన్స్ రద్దు, 30 రోజుల వరకు వాహనం జప్తు చేయటం జరుగుతుంది.
* స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం తాగి నడిపితే రూ.50,000 జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్ష. ఒకవేళ 18-25 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు ఇలాంటి నేరానికి పాల్పడితే వెంటనే లెసైన్స్ రద్దు చేయటం జరుగుతుంది.
* ట్రాఫిక్ సిగ్నళ్లను మూడుసార్లు ఉల్లంఘిస్తే రూ.15,000 జరిమానా, నెలపాటు లెసైన్స్ రద్దు, తప్పనిసరిగా తాజా డ్రైవింగ్ శిక్షణ. పదేపదే ప్రమాదాలకు కారణమయ్యేవారిని గుర్తించేందుకు ఎలక్ట్రానిక్ డిటెక్షన్, కేంద్రీకృత నేర సమాచార వ్యవస్థ మరియు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద సీసీటీవీ కెమరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే వాహనాల్లో స్పీడ్ లిమట్స్, డ్రైవర్ల నిద్రమత్తు గుర్తింపు తదితర భద్రతా పరికరాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
* ఇక చివరిగా.. ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తొలి గంటలోనే (గోల్డెన్ అవర్) నగదు రహిత చికిత్స (క్యాష్లెస్ ట్రీట్మెంట్)ను అందించేలా మోటార్ యాక్సిడెంట్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. దీనికింద రోడ్డును ఉపయోగించే వారందినీ తప్పనిసరిగా బీమా పరిధిలోకి తీసుకొని రావటం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, ప్రమాదాల్లో మరణించిన వారికి సంబంధించిన బంధువులు ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications








