ఇండియన్ మోడళ్ల కోసం ఏఎమ్టిని అభివృద్ధి చేస్తున్న నిస్సాన్
మారుతి సుజుకి తమ సెలెరియో కారులో ప్రవేశపెట్టిన ఏఎమ్టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీ సక్సెస్ సాధించడంతో ఇతర కార్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులలో ఈ తరహా టెక్నాలజీ (గేర్బాక్స్)ని ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే టాటా మోటార్స్ తమ ఉత్పత్తులలో ఏఎమ్టిని ఆఫర్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే, తాజాగా జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ కూడా ఇండియాలోని తమ ఉత్పత్తులలో ఏఎమ్టిని ఆఫర్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిస్సాన్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న మైక్రా, సన్నీ మోడళ్లలో ఖరీదైన ఎక్స్-ట్రానిక్ సివిటి ఆటోమేటిక్ గేర్బాక్స్ను ఉపయోగిస్తోంది.

నిస్సాన్ ఉపయోగిస్తున్న ఈ ఎక్స్-ట్రానిక్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఇతర కార్ మేకర్లు ఆఫర్ చేస్తున్న సాంప్రదాయ ఆటోమేటిక గేర్బాక్సులు, ఏఎమ్టి కన్నా ఖరీదైనదే కాకుండా మరింత సమర్థవంతంమైనది కూడా. జాట్కో కంపెనీ అందిస్తున్న ఈ సివిటి గేర్బాక్స్ ఖరీదైనది కావటంతో, నిస్సాన్ ఆటోమేటిక్ కార్లు కూడా ఎక్కువ ధరను కలిగి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో, మార్కెట్ పోటీని తట్టుకునేందుకు నిస్సాన్ ఏఎమ్టిని ఆశ్రయించాలని భావిస్తోంది.
ప్రస్తుతం మారుతి, సుజుకి వంటి కంపెనీలు ఏఎమ్టి యూనిట్ల కోసం ఇటలీకి చెందిన మాగ్నెటి మారెల్లీపై ఆధారపడుతున్నాయి. అయితే, నిస్సాన్ మాత్రం ఇలా చేయకుండా, స్వతహాగానే ఏఎమ్టిని అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. నిస్సాన్ అందిస్తున్న ప్రస్తుత మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్లలో ఏదైనా ఒకదానిని ఆధారంగా చేసుకొని తమ స్వంత ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ను అభివృద్ధి చేసే ఆస్కారం ఉంది. ఇలా చేయటం ఉత్పాదక వ్యయాన్ని తగ్గించుకోవచ్చని నిస్సాన్ భావిస్తోంది.
ఇదే గనుక జరిగితే, భవిష్యత్తులో నిస్సాన్ ఎంట్రీ లెవల్ మోడళ్లు అలాగే డాట్సన్ బ్రాండ్ కార్లు కూడా ఏఎమ్టి గేర్బాక్స్తో లభించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








