మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు
పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. లీటరుకు పెట్రోలు రేటును రూ.1.69, డీజిల్ రేటును 50 పైసల చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
ఇరాక్లో కొనసాగుతున్న సంక్షోభం, విదేశీ మారకం హెచ్చుతగ్గుల కారణంగా ఈ రేట్లను పెంచాల్సి వచ్చినట్లు చమురు కంపెనీలు వెల్లడించాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ చమురు ధరల్లో గణనీయ పెంపుదల చోటు చేసుకుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది.
పెరిగిన ధరకు స్థానిక పన్నులు కలుపుకుంటే పెట్రోలుపై లీటరుకు రూ.2 మరియు డీజిల్పై 75 పైసలకు పైగా పెరుగుతుంది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోలు లీటరుకు రూ.2.02 పెరిగి రూ.73.58కి చేరుకుంది. అలాగే, డీజిల్ రేటు 56 పైసలు పెరిగి రూ.57.84కు చేరుకుంది.

సబ్సిడీ ధరకే డీజిల్ను విక్రయిస్తుండటంతో, తమపై పడుతున్న భారాన్ని తప్పించుకునేందుకు ప్రతినెలా కొద్ది మొత్తంలో డీజిల్ ధరను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో, చమరు కంపెనీలు ఇదివరకటి మాదిరిగానే డీజిల్ ధరను స్వల్పంగా పెంచాయి.
గత కొంత కాలంగా డీజిల్ ధరను పెంచుతూ వస్తున్నప్పటికీ, తాము ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.3.40 వరకు నష్టపోతున్నామని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








