స్కొడా నుంచి ఓ సరికొత్త 7-సీటర్ ఎస్యూవీ వస్తోంది!
చెక్ రిపబ్లిక్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా, భారత మార్కెట్లో సెడాన్ సెగ్మెంట్లో రాణించినంతగా ఎస్యూవీ సెగ్మెంట్లో రాణించలేకపోయింది. ప్రస్తుతం స్కొడా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఏకైక ఎస్యూవీ యెటి మాత్రమే. అది కూడా కస్టమర్లను ఆకట్టుకోవటంలో అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో ఎలాగైనా ఎస్యూవీ సెగ్మెంట్లో మంచి మార్కులు కొట్టేయాలనే ఉద్దేశ్యంతో స్కొడా ఇండియా సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కేవలం భారత మార్కెట్ కోసమే స్కొడా ఇండియా ఓ సరికొత్త ఎస్యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం (ఇది ఖచ్చితంగా స్కొడా యెటి ఫేస్లిఫ్ట్ మోడల్ మాత్రం కాదు).
స్కొడా తయారు చేస్తోన్న తమ కొత్త ఎస్యూవీ పొడవులో 4.6 మీటర్లు ఉండి, 7-సీటర్ ఆప్షన్తో (ప్రత్యేకించి మన మార్కెట్లో సీటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఎస్యూవీలకు మంచి గిరాకీ ఉంటుందనే ఉద్దేశ్యంతో) తయారు చేయనున్నారట. ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం కూడా ఇందులో ఓ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

స్కొడా మాతృ సంస్థ ఫోక్స్వ్యాగన్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఎమ్క్యూబి ప్లాట్ఫామ్పైనే ఈ కొత్త ఎస్యూవీని కూడా తయారు చేయనున్నారు. వీలైనంత వరకు దీనిని ఫోక్స్వ్యాగన్ క్రాస్బ్లూ కాన్సెప్ట్ (పై ఫొటోలో ఉన్న మోడల్)ను ఆధారంగా చేసుకొని తయారు చేసే అవకాశం ఉంది. బహుశా ఇది 2015 నాటికి మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.
ఈ కొత్త స్కొడా ఎస్యూవీ ధర సుమారు రూ.25 లక్షలు ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ శాంటాఫే వంటి ప్రీమియం ఎస్యూవీలకి పోటీగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్పోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచి ఫేస్లిఫ్ట్ వెర్షన్ స్కొడా యెటిని ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








