టూవీలర్స్ నడిపే వారు ఆ 5 విషయాలు గుర్తుంచుకోవాలి.. చట్టం ఏం చెబుతుందో తెలుసా? లేదంటే చిక్కుల్లో పడ్డట్లే!
టూవీలర్ నడిపేందుకు లైసెన్స్, ఇతర డాక్యుమెంట్స్ చాలా కీలకం. బండి నడవాలంటే పెట్రోల్ ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ బండిని అధికారికంగా రోడ్లపై తిరిగేలా చేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే రోడ్డు అనే పబ్లిక్ ప్లేస్లో అనుమతులు లేకుండా వాహనం నడపడం నేరం. ఎవరూ అభ్యంతరం చెప్పకుండా ఉండాలంటే పర్మిట్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలామంది వీటిని పట్టించుకోవడం లేదు. అందువల్ల ట్రాఫిక్ పోలీసులకు చిక్కి జరిమానా చదివించుకుంటున్నారు. ముఖ్యంగా టూవీలర్పై వెళ్తుంటే ఏఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చాలామందికి తెలియదు. వీటిని తీసుకువెళ్లేందుకు చాలామందికి ఇష్టపడరు కూడా. అందువల్ల చలానా కట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
మన దేశంలో కోట్ల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అయితే అందరూ వినియోగదారులు తమ వద్ద అన్ని సరైన పత్రాలు ఉన్నాయని ధృవీకరించడం కష్టం. అంతేకాకుండా ద్విచక్ర వాహన వినియోగదారుల్లో ఎక్కువ మంది నిరుపేదలు, మిడిల్ క్లాస్ వారే కావడం వల్ల వీటిని పట్టించుకోరు. అయితే ఇలాంటి వారు జరిమానాల నుంచి తప్పించుకోవాలంటే ఉండాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి? వారు చేయకూడని పనులు ఏమిటి? తదితర అంశాలపై ఈ కథనంలో..

డాక్యుమెంట్లు: ఇంటి నుంచి రోడ్డుపైకి మోటార్ సైకిల్ తీసుకెళ్లే ముందు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్, టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీ, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీ) తప్పనిసరిగా ఉండాలి.
18 నుంచి 50 ఏళ్ల లోపు వారు మాత్రమే ద్విచక్ర వాహనాన్ని నడపాలి. అంతకు పైబడితే అందుకు తిగిన మెడికల్ సర్టిఫికేట్ని కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఆ వ్యక్తి మోటార్ సైకిల్ నడపడానికి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నాడని చట్టం చెబుతోంది. ఇలాంటి వారిని కూడా పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.

ఇన్సూరెన్స్: మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, భారతీయ రోడ్లపై తిరిగే అన్ని ద్విచక్ర వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. అప్పుడే మీ ద్విచక్రవాహనం వల్ల ఎవరైనా గాయపడితే వారికి తగిన పరిహారం చెల్లించవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ లేని ద్విచక్ర వాహనాలకు జరిమానాలు విధించడం, సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది.
ఎక్స్ప్రెస్ వేస్ లేవు: ముఖ్యంగా ఎక్స్ప్రెస్ వేస్కి, హైవేలకు మధ్య తేడా ఉంది. ఎక్స్ప్రెస్ వేలు నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలను అనుమతించే ఎక్స్ప్రెస్ వేలు మూడు మాత్రమే ఉన్నాయి. ఈ మూడూ నార్త్ ఇండియాలోనే ఉన్నాయి. కాబట్టి ఎక్స్ప్రెస్ హైవేలపై బైక్ నడుపుతూ ఇరుక్కుపోవద్దు. ఇటీవలి ఎక్స్ప్రెస్ వేస్లోనూ ఆనుకుని టూ వీలర్, త్రీ వీలర్ రోడ్లను నిర్మిస్తున్నారు.

పీయూసీ సర్టిఫికేట్: ఏదైనా కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినప్పుడు PUC (Pollution Under Control) 1 సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత వాహనం నుంచి ఎంత కార్బన్ కాలుష్యం వెలువడుతుందో తెలుసుకునేందుకు పీయూసీని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఆమోదం పొందిన ఏజెన్సీ ద్వారా జరగాలి.
మోడిఫికేషన్ చేయవద్దు: కార్ల మాదిరిగానే, భారతదేశంలో ద్విచక్ర వాహనాల మోడిఫికేషన్లపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. 1988 మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల్లో భాగంగా ద్విచక్రవాహనం ఆకారాన్ని మార్చడం, ప్రకాశవంతమైన లైట్లను బిగించడం, వాహనానికి సరిపోని టైర్ని బిగించడం వంటివి చేయకూడదు. ఒకవేళ ద్విచక్రవాహనం రంగు మార్చాలనుకుంటే ఆర్టీవోకు సమాచారం అందించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
డ్రైవ్స్పార్క్ వ్యాఖ్య: ప్రతి ద్విచక్ర వాహనాన్ని దాని తయారీదారులు వివిధ తనిఖీలు మరియు పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే మార్కెట్ చేస్తారు. అలాంటప్పుడు ద్విచక్ర వాహనాలను వాడేందుకు సరైన పర్మిట్ డాక్యుమెంట్లు లేకుండా ఇష్టానుసారం మాడిఫై చేయడం సమంజసం కాదు. వీటిపై ఎన్ని ఆంక్షలు ఉన్నా కానీ మోడిఫైడ్ ద్విచక్ర వాహనాలు, సరైన పత్రాలు లేకుండా ఉపయోగిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications








