నిర్లక్ష్యంతో వ్యవహరించకండి.. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించండి
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరైనా ప్రమాదానికి గురైతే కాస్తంతైనా మానవత్వం లేకుండా తమ పాటికి తాము వెళ్లిపోయే వారు కొందరైతే, ప్రమాదం జరిగిన వాహనం చుట్టూ చేరి సర్కస్ చూసినట్లు చూసి బెల్లం కొట్టిన రాయిలా నిలుంచుండే వారు మరికొందరు. ప్రమాదంలో గాయపడిన వారిని చూసి అయ్యో పాపం అనేవారే తప్ప వారికి సాయం చేద్దామనుకునే వాళ్లు తక్కువైపోతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన వారు ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు వదిలేస్తున్నారు.
ఈ మరణాల రేటును మనమే తగ్గించవచ్చు. ఇందుకు మనం చేయాల్సిందల్లా ప్రమాదంలో గాయపడిన వారికి ప్రధమ చికిత్స అందించడమే. అంతేకాదు, అంబులెన్స్కు కాల్ చేయటం ఒకవేళ అంబులెన్స్ రావటం ఆలస్యమయ్యేటట్లుంటే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం వంటివి చేయాలి.
యాక్సిడెంట్లో గాయపడిన వారికి రక్షించడానికి చాలా మంది వెనుకంజ వేయటానికి ప్రధాన కారణం పోలీస్ కేసులు అవుతాయని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయమే. వాస్తవానికి ప్రస్తుతం చట్టాలు మారిపోయాయి. యాక్సిడెంట్లో గాయపడిన వారిని ఎలాంటి ఎఫ్ఐఆర్, పోలీస్ జోక్యం అవసరం లేకుండానే ఆస్పత్రిలో చేర్చుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఎవ్వరూ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఊహించరు, కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి, సాటి మనిషిగా మానవత్వంతో, సహృదయంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేయడంలో మీ వంతు సాయాన్ని చేయడానికి వెనుకంజ వేయకండి. ఎల్లప్పుడూ ఫోన్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లను ఫీడ్ చేసుకొని ఉంచుకోండి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతాయి. ప్రమాదంలో ఉన్న వారికి సాయపడండి.


Click it and Unblock the Notifications









