రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మైలురాళ్లను గమనించారా.. అవి వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా ?
మీరు సాధారణంగా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కిలో మీటర్ల దూరాన్ని తెలిపేందుకు వేసిన మైలు రాళ్లను చూసే ఉంటారు. దాని మీద ఊరి పేరు, వచ్చే గ్రామం ఇంకా ఎన్ని కిలో మీటర్ల దూరం ఉంటుందో దాని మీద పెయింట్ చేసి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మైలు రాళ్లు వివిధ రకాల రంగుల్లో ఏర్పాటు చేసి ఉంటాయి. మరి ఇలా మైలురాళ్లకు వివిధ రంగులు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా..
మైలురాళ్లు అంటే రోడ్లు లేదా హైవేల వెంట ఏర్పాటు చేసిన రాళ్లు. ఈ రంగులను బట్టి వాటికి అర్థాలు ఉంటాయి. ఈ రోజుల్లో GPS-అమర్చిన స్మార్ట్ఫోన్స్ అందుబాటులోకి రావడం వల్ల మైలు రాళ్లను పెద్దగా పట్టించుకోరు. కానీ గతంలో ప్రజలు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలో తెలుసుకోవడానికి ఈ మైలురాళ్లను ఉపయోగించే వారు.

ఈ 'మైలురాళ్ళు' వేర్వేరు రంగులలో ఉంటాయి. అలాంటి రంగులు దూరం గురించి సమాచారాన్ని అందించేందుకు మాత్రమే కాకుండా మనం ఏ రకమైన రోడ్డుపై ప్రయాణిస్తున్నామో తెలియజేయడానికి కూడా ఉపయోగపడతాయి. భారత రోడ్ నెట్వర్క్ 5.6 మిలియన్ కిలోమీటర్ల పొడవు ఉంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారుల మధ్య తేడాను గుర్తించడానికి మైలురాళ్లను వివిధ రంగులతో గుర్తించారు. వివిధ మార్గాల్లో మైలురాళ్ల రంగు కూడా మారుతుంది.
ఈ రాళ్లు రివర్స్ U ఆకారంలో కనిపిస్తాయి. ఈ రాళ్ల పై భాగంలో గ్రీన్, యెల్లో, బ్లాక్, ఆరెంజ్ కలర్స్ లలో ఉంటుంది. మైలురాయి కింది భాగం మాత్రం తెలుపు రంగులో ఉంటుంది. వీటిని గమనించినప్పుడు ఈ రాళ్ల పై భాగాలు మాత్రం వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో మెదలుతుంది. దానికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

నీలి రంగు మైలురాళ్లు: నీలి రంగు మైలురాళ్ళు ప్రధానంగా ఎక్స్ప్రెస్ హైవేలకు అందిస్తారు. మీరు ఎప్పుడైనా ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే, యమునా ఎక్స్ప్రెస్వేలో ప్రయాణించి ఉంటే నీలిరంగు మైలురాళ్లను గమనించి ఉంటారు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఈజీగా చేరుకునేందుకు ఇటువంటి ఎక్స్ప్రెస్వేలను నిర్మించారు. విస్తృతమైన మౌలిక సదుపాయాలతో నిర్మించబడిన ఈ ఎక్స్ప్రెస్వేలు హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికార పరిధిలోకి వస్తాయి.
పసుపు రంగు మైలు రాళ్లు: రోడ్డు పక్కన కనిపించే మైలురాయి పై భాగంలో పసుపు రంగులో దిగువ భాగం తెలుపు రంగులో ఉంటే మీరు ప్రయాణం చేస్తున్నది జాతీయ రహదారి అని గుర్తు పెట్టుకోవాలి. ఈ రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. దీని పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది.

ఆకుపచ్చ రంగు మైలురాళ్లు: ప్రయాణ సమయంలో రోడ్డు పక్కన ఉన్న మైలురాయిలో పైభాగంలో పచ్చగా, కింది భాగం తెల్లగా ఉంటే మీరు ప్రయాణిస్తుంది జాతీయ రహదారి కాదని అది రాష్ట్ర రహదారి అని అర్థం. ఈ రోడ్డు నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి.
బ్లాక్ కలర్ మైలురాళ్లు:రోడ్డు పక్కన కనిపించే మైలురాయిలో పైభాగం నల్లగా, కింది భాగం తెల్లగా ఉంటే జిల్లా రహదారిపై ప్రయాణిస్తున్నట్లు గుర్తించాలి. ఈ రహదారి బాధ్యత జిల్లా యంత్రాంగం చూసుకుంటుంది. ఈ రహదారిలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు స్థానిక జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతుంది. సంబంధిత రాష్ట్ర, జిల్లా అధికారులు సంయుక్తంగా ఈ రహదారికి మరమ్మతులు చేస్తారు.
ఆరెంజ్ కలర్ మైల్స్టోన్:రోడ్డు పక్కన ఉన్న మైలురాయిలో పై భాగం ఆరెంజ్ కలర్ లో ఉండి, కింది భాగం తెలుపు రంగులో ఉంటే మీరు గ్రామీణ రహదారిపై ప్రయాణిస్తున్నట్లు అర్థం. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇలాంటి రోడ్లను నిర్మిస్తారు. ఈ రోడ్లను నిర్వహించే బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుంది.


Click it and Unblock the Notifications








