రోడ్డు యాక్సిడెంట్ నష్టపరిహారం పొందడం ఎలా..!?

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఇతరుల నిర్లక్ష్యం వల్ల జరిగే చిన్న చిన్న ప్రమాదాలకు కూడా బీమా కంపెనీల నుండి నష్టపరిహారాన్ని పొందవచ్చునని. కొందరికి బీమా కంపెనీల చుట్టూ తిరిగే సమయం లేకపోవడం వల్లనో.. లేదా బీమా కంపెనీలు మంజూరు చేసే నష్టపరిహారంలో జాప్యంవ వల్లనో.. లేదా నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది కాబట్టి బీమా మొత్తం వస్తుందో.. రాదో.. అన్న అనుమానంతోనో.. లేదా మరే ఇతర కారణాల వల్లనో వాహన యజమానులు మరమ్మత్తులకు అయ్యే ఖర్చులను తామే భరించడం జరుగుతుంది.
మరి యజమానుల చేతి చమురు వదలకుండా మరమ్మత్తుకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీల నుండి ఎలా పొందాలో ఒక్కసారి పరిశీలించండి...! భారత్లో మోటార్ యాక్సిడెంట్ ప్రమాదాలకు సంబంధించి నష్టపరిహారాలను వసూలు చేసుకునేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఇందుకోసం "మోటార్ యాక్సిడెంట్ క్లయిమ్ల్ ట్రిబ్యునల్" (మాక్ట్) అనే ఫోరంను 'మోటార్ వెహికల్ యాక్ట్, 1988' చట్టం కింద స్థాపించడం జరిగింది.
ఎటువంటి యాక్సిండెంట్లు కవర్ అవుతాయి.:
మోటార్ వాహనం వల్ల ప్రమాదం జరిగి వ్యక్తి మరణించినా, శారీరకంగా గాయపడినా, ఆస్తి నష్టం (వాహనం దెబ్బతినడం లేదా వాహన యాక్సిడెంట్ వల్ల ఇతర వ్యక్తులకు జరిగే ఆస్తి నష్టాలు) వంటివి ఈ క్లయిమ్స్ ట్రిబ్యునల్ ముందు పరిష్కరించుకోవచ్చు.
1. ట్రాఫిక్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా ఇతరులు డ్రైవ్ చేయడం వల్ల మీ వాహనానికి నష్టం వాటిల్లినా..
2. ఇతరులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల మీ వాహనానికి ప్రమాదం జరిగినా..
3. అధిక వేగం: ఇతరులు నిర్దేశిత వేగం కన్నా అధిక వేగంతో రావడం వల్ల మీ వాహనానికి ప్రమాదం జరిగినా..
4. మలుపు (కర్వ్)లను పట్టించుకోకుండా ఇతరులు వేగంగా రావడం వల్ల ప్రమాదం సంభవించినా..
5. వెనుక వైపు నుంచి తమ వాహనాన్ని వేరే వాహనం ఢీకొట్టినా..
పై సంఘటనలలో ఏ ప్రమాదైనికైనా కూడా నష్టపరిహారాన్ని పొందవచ్చు.
రోడ్డు యాక్సిడెంట్ నష్టపరిహారాన్ని క్లయిమ్ చేసుకునే విధానం.:
యాక్సిడెంట్ వల్ల గాయపడిన వ్యక్తి గానీ, లేదా నష్టపోయిన యజమాని కానీ నష్టపరిహారాన్ని క్లయిమ్ చేస్తూ ఓ అప్లికేషన్ను లీగల్ రిప్రజింటేటివ్ లేదా బీమా ఏజెంట్ ద్వారా ఈ ట్రిబ్యునల్కు అందజేయాలి. అవతలి వ్యక్తి రాష్గా డ్రైవ్ చేయడం వల్లనో లేక నిర్లక్ష్యధోరణి వల్లనో ప్రమాదం సంభవిస్తే ఆ విషయాన్ని మీరు ట్రిబ్యునల్ ముందు ధృవీకరించాల్సి ఉంటుంది. (ఉదా: నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన వ్యక్తి ట్రిబ్యునల్ ముందు తన తప్పు అంగీకరించడం లేదా ఆ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ యాక్సిడెంట్పై ఇచ్చే నివేదిక, పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ లాంటివి).
ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు.. ఆ ప్రమాదం చేసిన వ్యక్తితో పాటు ప్రమాదానికి గురైన వ్యక్తి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ కూడా నష్టపరిహారాన్ని పొందవచ్చు. అయితే ఈ సందర్భంలో మాత్రం ట్రిబ్యునల్ నష్టపరిహార చెల్లింపులో కోతను విధించడం జరుగుతుంది. ఉదాహరకు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు కిటికిలోంచి తన చెయ్యి బయట పెట్టడం వల్ల ప్రమాదం సంభవిస్తే.. అందుకు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు ప్రయాణికుడి నిర్లక్ష్యం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో నష్టపరిహారం కోసం ప్రయాణికుడు ధరఖాస్తు చేసుకుంటే.. తన నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదం జరిగింది కాబట్టి అతని అందజేసే నష్టపరిహారాన్ని తగ్గించి ఇవ్వడం జరుగుతుందన్నమాట.
అంతే కాకుండా.. ఈ ట్రిబ్యునల్లో మరొక అవకాశం కూడా ఉంది.. ఉదాహరణకు ముంబై, ఢిల్లీలో నివశించే ఇద్దరు వ్యక్తుల మధ్య వేరే ఏ ప్రాంతంలోనైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే.. ఈ క్లయిమ్ను యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో కానీ లేదా ఢిల్లీలో లేదా ముంబైలలో ధరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా యాక్సిడెంట్ సంభవించిన వెంటనే దాని గురించి తక్షణమే పోలీసులకు ఫిర్యాదు అందించాలి. 30 రోజుల్లోగా పోలీసులు ఆ నివేదికను క్లయిమ్స్ ట్రిబ్యునల్కు అందజేయాల్సి ఉంటుంది. పోలీసులు పంపిన నివేదికను క్లయిమ్స్ ట్రిబ్యునల్ నష్టపరిహారానికి ధరఖాస్తుగా పరిగణించి సదరు పరిహారాన్ని మంజూరు చేయడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








