థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్తో బోలెడు బెనిఫిట్స్.. మరింత రక్షణ, ఆర్థిక భద్రత మిస్ అవ్వకండి!
ప్రస్తుతం వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే చాలా మంది సొంత వాహనాల్లో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలోని సగానికి కంటే ఎక్కువ ఇళ్లలో కచ్చితంగా ఎదో ఒక వాహనం ఉంటుంది. ప్రజలు తమ రోజువారి అవసరాలకు కార్లు, టూవీలర్లను కలిగి ఉంటారు. ముఖ్యంగా కార్ల వాడకం బాగా పుంజుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ధనవంతులతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా బడ్జెట్ ధరలో లభించే కార్లను కొనుగోలు చేస్తున్నారు. ధర తక్కువగా ఉండి, మైలేజ్ ఎక్కువ ఇచ్చే, మెరుగైన పెర్ఫామెన్స్ కలిగిన మోడళ్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే కారు కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నప్పటికి వాటి ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. దీని వల్ల ఆస్తి, ప్రాణ నష్టం రెండూ జరుగుతున్నాయి. అందుకే హహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ (insurance) తీసుకోవాలి.
చాలా మంది దీన్ని తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్(Third-party insurance)ను తప్పనిసరి చేసింది. దీంతో చేసేదేమీ లేక అందరు తమ కార్లకు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం వెనకడుగు వేస్తున్నారు. కార్లకు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సరైన అవగాహన లేక కొంతమంది ముందుకు రావట్లేదు, మరికొందరు వాహనానికి ఏం కాదులే అనే ధీమాతో బీమా చేయించడం లేదు.

దేశంలో చాలా కంపెనీలు వాహనాలకు బీమా పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. వాహన యజమానులకు మొత్తం నష్టాన్ని భర్తీ చేసే పాలసీతో పాటు, ప్రమాదం తర్వాత అవతలి వారికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి థర్డ్ పార్టీ పాలసీలను వివిధ బీమా కంపెనీలు అందిస్తున్నాయి. రోడ్డు యాక్సిడెంట్లు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, వ్యక్తిగత ప్రమాదాలు వంటి వాటి వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి పలు ప్యాకేజీలు ప్రస్తుతం ఉన్నాయి.
దేశంలో వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాబట్టి దీని గురించి వివరంగా తెలుసుకుందాం.. ఇది పూర్తి కవరేజ్ పాలసీలతో పోలిస్తే తక్కువ ప్రీమియంకు లభిస్తుంది. అవతలి వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రీమియం అనేది మీరు తీసుకుంటున్న ప్యాకేజీని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రమాదవశాత్తూ ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే అవతలి వ్యక్తి మరణించిన సందర్భంలో నష్టపరిహారం 100 శాతం వరకు చెల్లిస్తారు.

లేదంటే ప్రమాదం కారణంగా థర్డ్ పార్టీ వారికి పాక్షికంగా అంగవైకల్యం ఏర్పడిన సమయంలో 50 శాతం నష్టం పరిహారం చెల్లిస్తారు. కొన్ని సందర్బాల్లో ఆస్పత్రి ట్రీట్మెంట్ ఖర్చులు 70 శాతం వరకు చెల్లించవచ్చు. పరిహారం అనేది ఎంచుకున్న ప్యాకేజీని బట్టి ఉంటుంది. పూర్తి కవరేజ్ పాలసీతో పోలిస్తే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన యజమాని కారణంగా అవతలి వ్యక్తికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది.
అదే సొంత నష్టాన్ని మాత్రం భర్తీ చేయడానికి వీలుండదు. దొంగతనం, వ్యక్తిగత ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలను థర్డ్ పార్టీ కవర్ చేయదు. అదే పూర్తి కవరేజ్ తీసుకున్నట్లయితే అన్ని రకాలుగా నష్టాన్ని పూడ్చడానికి అవకాశం ఉంటుంది. వాహనం యజమాని ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో సరైన ప్రీమియంను ఎంచుకుని అన్ని విధాలుగా ఉపయోగపడే దాన్ని తీసుకోవడం ఉత్తమం. కారు ఖరీదు ఎక్కువ ఉన్నట్లయితే పూర్తి కవరేజ్ పాలసీని తీసుకోవడం బెస్ట్.

థర్డ్ పార్టీకి సంబంధించి కంపెనీలు అందించే ప్యాకేజీలు చాలా వరకు ఆన్లైన్లో ఉన్నాయి. వాటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీకు సరిగ్గా సరిపోయే పాలసీలను నేరుగా ఆన్లైన్ నుంచే కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే విషయంలో కూడా అలర్ట్గా ఉండాలి. నిర్దిష్ట సమయంలోగా ప్రమాదం వివరాలు బీమా కంపెనీకి అందించాలి. ఎఫ్ఐఆర్ కాపీ, అవసరమైన ఇతరత్రా పత్రాలు కంపెనీకి వీలైనంత తొందరగా ఇవ్వాలి.


Click it and Unblock the Notifications








