హైబ్రిడ్ వాహనాలను ఎందుకు కొనాలి..?

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న శిలాజ ఇంధనాల (భూమిలో లభించే ముడి ఇంధనాలు) నిల్వలు భూమిలో మరెంతోకాలం ఉండబోవన్న సంగతి మనందరికీ తెలిసిన సత్యమే. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు సంప్రదాయేతర ఇంధన వనరులకోసం ప్రపంచ వ్యాప్తంగా తమ పరిశోధనలు తీవ్ర స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా మద్దతు తెలుపడంతో పాటు భారీ మొత్తంలోనే నిధులను కేటాయించడం జరుగుతుంది.
ప్రపంచం దేశాలలో రవాణా వ్యవస్థలు విస్తృతంగా అభివృద్ధి చెందివున్న ఈ తరుణంలో ఇంధన కొరత భయం అందరినీ వెంటాడుతూనే ఉంది. ఒకవేళ ఏదైనా దేశంలో ఇంధన కొరత ఏర్పడితే.. మొత్తం రవాణా వ్యవస్థ స్థంభించడమే కాకుండా.. ఆ దేశ ఆర్థికవ్యవస్థలు సైతం కుప్పకూలడం తథ్యం. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు ముందు జాగ్రత్తతో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి.
తరుగుతున్న ఇంధన వనరుల నేపథ్యంలో భారత్లో ఇంధన ధరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ప్రజలు చాలా వరకూ హైబ్రిడ్ కార్లపైనే మక్కువ చూపే ఆస్కారం ఉంది. ఇంకా.. ఇటువంటి హైబ్రిడ్ కార్లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా అధికంగానే ఉంటాయి. ఉదాహారణకు, పన్ను రాయితీలు, దిగుమతి సుంకాలు వంటివి. పైపెచ్చు ఇవి బుర్.. బుర్.. అంటూ శబ్దం చేయకుండా ఇటు శబ్ద, అటు వాయు కాలుష్యాలను కలిగించవు.
వాస్తవానికి భారత్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా తక్కువనే చెప్పాలి. ప్రజలకు వీటిపట్ల సరైన అవగాన లేకపోవడమో.. లేక వారి నిత్యావసరాలకు వీటి సామర్థ్యం సరిపోకపోవడమో.. లేక వీటి ధరలు అధికంగా ఉంటమో... మరే ఇతర కారణమైనా కావచ్చు. వాటి ఫలితంగా.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ఈ కారణాలను బట్టిచూస్తుంటే.. ఆటో పరిశ్రమలు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే కార్ల కన్నా... బ్యాటరీతో నడిచే కార్లకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








