అక్కడ 2021 మే 30 వరకు లాక్డౌన్ పొడిగింపు.. అన్ని సర్వీసులు నిషిద్ధం
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రజల ప్రాణాలు బలిగొంటోంది. ఈ క్లిష్ట సమయంలో కరోనా నివారణ కోసం దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి.

పశ్చిమ బెంగాల్లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల 15 రోజుల పూర్తి లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ ఈ మహమ్మారి మరింత విజృంభిస్తున్న సమయంలో ఈ లాక్ డౌన్ సమయాన్ని కాస్త పొడిగిస్తూ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జరీ చేసింది.

నివేదికలు ప్రకారం 2021 మే 30 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించబడుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో ప్రజా రవాణా, మెట్రో రైలు మరియు బస్సు సర్వీసులు పూర్తిగా నిషేధించబడింది.

లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా పశ్చిమ బెంగాల్ లో మే 16 నుండి అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రైవేట్ సంస్థలు మూసివేయబడతాయి. కానీ ఇందులో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించబడతాయి. ఇంటర్ స్టేట్ బస్ సర్వీస్, మెట్రో, ఫెర్రీ, జిమ్, సినిమా హాల్, సెలూన్, స్విమ్మింగ్ పూల్స్ కూడా మొత్తం మూసివేయబడతాయి.

అయితే ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కిరాణా దుకాణాలు మాత్రం ఉదయం 7 నుండి 10 వరకు తెరిచి ఉంటాయి. కావున ప్రజలు ఈ సమయంలో మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి. అయితే పెట్రోల్ బంకర్లు 15 రోజుల లాక్ డౌన్ సమయంలో తెరిచి ఉంటాయి.

ఈ లాక్ డౌన్ సమయంలో పాలు, నీరు, మెడిషన్స్, విద్యుత్, ఫైర్, శాంతిభద్రతల వంటి అవసరమైన సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఈ కామర్స్ మరియు హోమ్ డెలివరీ సర్వీసులకు అనుమతి ఉంది. కావున ఇది అందుబాటులో ఉంటుంది. కానీ అన్ని రకాల సామాజిక, విద్యా, రాజకీయ, మతపరమైన వేడుకలు పూర్తిగా నిషేధించబడ్డాయి.

కంపెనీలు దాదాపుగా మూసివేయబడతాయి. కొన్ని కంపెనీల్లో 30% కార్మికులతో పని చేయవచ్చు. వివాహాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి లాక్ డౌన్ సమయంలో అనుమతి ఉంటుంది. టాక్సీ, ఆటో, ప్రైవేట్ వాహనాల సర్వీసులు కూడా మే 30 వరకు నిలిపివేయబడుతుంది.

పశ్చిమ బెంగాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో శుక్రవారం ఒక్క రోజులో 20,846 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్లో కరోనా సోకినా వారి సంఖ్య మొత్తం 10,94,802 కు చేరింది. పశ్చిమ బెంగాల్లో శుక్రవారం 136 మందికి కరోనా వైరస్ మహమ్మారి వల్ల మరణించారు. ఈ మరణాలతో సహా కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,993 కు పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది.


Click it and Unblock the Notifications








