Union Budget 2024: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 40 వేల కోచ్ల్లో వందే భారత్ స్థాయి ప్రమాణాలు.!!
2024 మధ్యంతర బడ్జెట్(Union Budget 2024) సమావేశాల్లో భారతీయ రైల్వే రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాంకేతికత పరంగా మరిన్ని మార్పులను తీసుకువస్తూ 40,000 రైల్ కోచ్లను అప్గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
భారతీయ రైల్వే రంగంలో కనెక్టివిటీ మరియు ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా రంగంలో ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు అధిక ప్రాధాన్యతిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) స్పష్టం చేశారు. గురువారం ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్లో రైల్వే రంగానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

అందులో ఒకటి.. 40,000(40000 train coaches Vande Bharat Standards) సాధారణ రైలు కోచ్లను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కాగా కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతూ వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
అత్యాధునిక సాంకేతికతతో వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) సెమీ హై స్పీడ్ రైళ్లను భారతీయ రైల్వే రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వీటిలో సౌకర్యాలను అందిస్తున్నారు. బయో టాయిలెట్లు, ఆటోమేటిక్ డోర్ క్లోజ్ సిస్టమ్, స్నాక్ ట్రేలు, ఏసీ, నాన్ ఏసీ, ఇంకా మరెన్నో ఫీచర్లను తీసుకువచ్చారు.

అంతే కాకుండా వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, మెట్రో వందే భారత్ పేరుతో మరిన్ని సౌకర్యాలతో ఈ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. కాగా ఇప్పటికే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయోధ్య నుంచి ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఈ క్రమంలో అత్యాధునిక సౌకర్యాలు ఉండటంతో పాటు, అతి వేగంగా ప్రయాణిస్తుండటంతో.. సాధారణ రైళ్ల కంటే వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది.
ఈ క్రమంలో వందే భారత్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం(Union Budget 2024 Indian Railway).. సాధారణ రైళ్ల కోచ్లను అదే ప్రమాణాలతో అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 40,000 సాధారణ రైల్ కోచ్లను వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్ల మాదిరిగా మార్చనున్నట్లు బడ్జెట్లో పేర్కొంది.

పీఎం గతి శక్తి పథకం కింద.. మల్డీ మోడల్ కనెక్టివిటీని ప్రారంభిస్తామని బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు లాజిస్టిక్స్ సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంధన, ఖనిజాలు మరియు సిమెంట్ కారిడార్, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్తో పాటు హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లను మూడు ప్రధాన ఆర్థిక కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
హై-ట్రాఫిక్ కారిడార్ల ద్వారా రద్దీని తగ్గించడం, ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఫలితంగా ప్రయాణీకులకు భద్రతతో పాటు ప్రయాణ వేగం కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు. జీడీపీ వృద్ధిలో ప్రత్యేక గూడ్స్ రవాణా కారిడార్లతో, మూడు కారిడార్లు దోహద పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక విమానయాన రంగం విషయానికొస్తే.. దేశంలో గత పదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపై 149కి చేరుకుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. UDAN పథకం ద్వారా టైర్ II మరియు టైర్ III నగరాలకు ఫ్లైట్ కనెక్టివిటీని విస్తరించినట్లు పేర్కొన్నారు. భారతీయ విమాన సంస్థలు 1,000 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయని తెలిపారు. కాగా ప్రస్తుతం సేవలందిస్తున్న ఎయిర్పోర్టులను విస్తరించడంతో పాటు, కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
దేశంలో మధ్యతరగతి వేగంగా విస్తరించడం పాటు.. పట్టణీకరణ కూడా అంతే వేగంగా జరుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలో మెట్రో రైల్తో కనెక్టివిటీ పాటు నమో భారత్ (Regional Rapid Transit System) ద్వారా పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రవాణా రంగంలో మరిన్ని విస్తరణలు జరగనున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








