ఔరా.. చేతులు లేకున్నా 'డ్రైవింగ్ లైసెన్స్' పొందిన మహిళ.. ఐదేళ్లు శ్రమించి లైసెన్స్ సొంతం
చేతులు లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ పొందింది ఓ మహిళ. ఈ లైసెన్స్ ఆమెకు అంత సులభంగా రాలేదు. అందుకోసం ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. దివ్యాంగురాలైనా.. దానికి చింతించకుండా ఎన్నో విజయాలను సాధించింది. కానీ స్వయంగా డ్రైవింగ్ చేయాలనే తన కల కోసం ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎట్టకేలకు డ్రైవింగ్ లైసెన్స్ సాధించి తన కలను సాకారం చేసుకుంది.
కాళ్లు, చేతులు పనిచేయకున్నా గొప్ప విజయాలు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. దృఢమైన సంకల్పంతో తమ కలలను నెరవేర్చుకున్న వారెందరో.. ఆర్ట్, సినిమా, స్పోర్ట్స్.. ఇలా ఒకటేమిటి వివిధ రంగాల్లోనూ వారు తమ అసాధారణ ప్రతిభతో తామెమిటో నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ మహిళ.. చేతులు లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది.

భారత్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే చాలా అర్హతలు ఉండాలి. అందులో ముఖ్యమైనది 18 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత చాలా టెస్ట్లు పాసవ్వాలి. ఆ తర్వాత ఆర్టీవో లైసెన్స్ జారీ చేస్తుంది. అయితే ఈ క్రమంలో శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యంగా కాళ్లు, చేతులు, కళ్లు సక్రమంగా పనిచేస్తున్న వారికే ప్రాధాన్యత ఉంటుంది. దివ్యాంగుల కోసం స్పెషల్గా ట్రై సైకిళ్లు అందుబాటులో ఉంటాయి.
కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం అందుకు విభిన్నం. కేరళకు చెందిన 32 ఏళ్ల జిలుమోల్ ఎం థామస్కు పుట్టుకతోనే చేతులు లేవు. కానీ అందుకు ఏ రోజూ ఆమె చింతించలేదు. చేతులు లేకపోవడం తన లక్ష్యాలకు అడ్డంకిగా భావించలేదు. మానసిక స్థైర్యంతో తన కలలను నెరవేర్చుకుంది. కానీ కారు డ్రైవింగ్ చేయాలనే తన ఆశకు మాత్రం ఆమె దివ్యాంగురాలు కావడం అడ్డంకిగా మారింది.

జిలుమోల్కు చిన్నప్పటి నుంచి కారు నడపాలని కల. చేతులు లేకున్నా కాళ్ల సహాయంతోనైనా కారు నడపాలని ఉండేది. కానీ కారు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కోసం ఆమె చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలు ఆమెను కారు నడిపేందుకు అనుమతించలేదు.
ఆమె మొదటి సారి డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. దివ్యాంగురాలు కావడంతో పాటు పలు సాంకేతిక కారణాల కారణంగా ఆమె అప్లికేషన్ను తిరస్కరించారు. కాగా జిలుమోల్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తోంది.. అంతే కాదు ఆమె స్వయంగా ఆర్టిస్ట్ కూడా.

ఐదేళ్ల క్రితం జిలుమోల్ డ్రైవింగ్ లైసెన్స్ను మోటారు వాహన శాఖ అధికారులు తిరస్కరించడంతో.. ఆమె అక్కడితో ఆగిపోకుండా రాష్ట్ర వికలాంగుల కమిషన్ను ఆశ్రయించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ను కమిషన్ కోరింది. ఈ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన పరిష్కారం చూపాలని ఎర్నాకులం జిల్లా మోటారు వాహన శాఖ అధికారులను రవాణా కమిషనర్ ఆదేశించారు.
దీనిపై పరిశీలన చేసిన MVD అధికారులు.. జిలుమోల్ కారు డ్రైవింగ్ చేసేందుకు అనువుగా ఉండేలా కారులో పలు మార్పులు చేయాలని సూచించారు. అయితే అటువంటి మోడిఫికేషన్స్ చేయడానికి స్థానికంగా ఏవీ అందుబాటులో లేకపోవడంతో.. ఈ రంగానికి చెందిన నిపుణులను సంప్రదించింది. ఏడాది లోపల కారులో అవసరమైన మార్పులు చేశారు.

కొచ్చికి చెందిన ఒక సంస్థ 2018 మోడల్ సెలెరియో హ్యాచ్బ్యాక్కి అన్ని ఎలక్ట్రానిక్ సంబంధిత మార్పులను చేసింది. దీంతో జిలుమోల్ తన పాదాలను ఉపయోగించి కారు స్టీరింగ్, క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ లాంటివి ఆపరేట్ చేయవచ్చు. కొన్ని ఫీచర్లను వాయిస్ రికగ్నిషన్ ద్వారా యాక్టివేట్, డీయాక్టివేట్ చేయవచ్చు.
ఈ మార్పులను తనిఖీ చేసిన మోటారు వెహికల్ డిపార్ట్మెంట్ అధికారులు.. జిలుమోల్ పబ్లిక్ రోడ్లపై నడపడానికి అనుకూలంగా ఉందని నిర్ధారించింది. మారుతి సెలెరియోలో చేసిన మార్పులకు అనుగుణంగా.. జిలుమోల్ ఈ ఏడాది మార్చిలో లెర్నర్స్ పరీక్షలో పాస్ అయ్యారు. ఇంకా నవంబర్లో ఆమె తన మారుతి సెలెరియోలో డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
అంతే కాకుండా జిలుమోల్ మారుతి సెలెరియో కారు RCకి MVD అధికారులు మార్పులు చేశారు. ఇది ఇప్పుడు అడాప్టెడ్ క్లాస్ వాహనంగా మారింది. ఎట్టకేలకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం తీవ్రంగా శ్రమించిన జిలుమోల్ కష్టానికి ప్రతిఫలం లభించింది. భారత్లో ఈ పద్ధతిలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తి జిలుమోల్. ఈ లైసెన్స్ను కేరళ ముఖ్యమంత్రి స్వయంగా ఆమెకు అందజేయడం విశేషం.


Click it and Unblock the Notifications








