రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో 4,500 వందే భారత్ రైళ్లు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రీమియం సెమీ-హై-స్పీడ్ రైళ్లుగా ప్రసిద్ధి చెందాయి. సాధారణ రైళ్లతో పోలిస్తే తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం వందే భారత్ స్లీపర్, వందే సాధారణ్, వందే మెట్రో రైళ్లను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో 2047 నాటికి 4,500 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేంద్రం నడపనుంది.
2047 నాటికి దేశంలో వందే భారత్ రైళ్ల(Vande Bharat Express)ను మరింతగా విస్తరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం వందే భారత్ రైళ్ల అంశంపై మాట్లాడారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. 2047 నాటికి 4,500 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి సింధియా తెలిపారు.

కాగా 2026-2027 ఏడాదిలో భారత్లో మొదటి హై-స్పీడ్ బుల్లెట్ రైలు నడవనుందని మంత్రి జ్యోతిరాదిత్య(Jyotiraditya Scindia) అన్నారు. నవీ ముంబైలో 2024 చివరి నాటికి రెండో విమానాశ్రయం ప్రారంభమవుతుందని.. వచ్చే ఏడాది జేవార్లో 'నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం' నిర్మిస్తామని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి అయోధ్యలో మరో విమానాశ్రయం సిద్ధమవుతుందని, దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని సింధియా వెల్లడించారు.
కేంద్రం వందే భారత్ ఎక్స్ప్రెస్, బుల్లెట్ రైళ్లను ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైళ్ల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను సున్నాకి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అన్నారు. 2014కి ముందు దేశంలో నాయకత్వం, దార్శనికత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని వెల్లడించారు.

కాగా 2019 ఫిబ్రవరిలో న్యూఢిల్లీ-వారణాసి మధ్య తొలి వందే భారత్ రైలుకి ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపారు. అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచిన వందే భారత్ ఎక్స్ప్రెస్ను భద్రతా కారణాల దృష్ట్యా దాని గరిష్ఠ వేగం గంటకు 130 కి.మీకి మాత్రమే పరిమితం చేశారు. ఈ రైలులో సీట్లు చాలా సౌకర్యవంతంగా, పూర్తిగా AC సిస్టమ్, Wi-Fi మరియు ఆటోమేటిక్ డోర్లు వంటి అధునాతన సౌకర్యాలను కల్పించారు.
క్రమంగా ఈ రైళ్లను విడతల వారీగా దేశవ్యాప్తంగా రైల్వే శాఖ విస్తరించింది. ప్రయాణికుల ప్రయోజనాల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను అభివృద్ధి చేస్తుండగా.. ఈ రైళ్లు 2024 ఫిబ్రవరి నాటికి ప్రారంభం కానున్నాయి. కాగా ఈ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సహకారంతో బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ తయారీ యూనిట్లో రూపొందిస్తున్నారు.

వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్లు, మొత్తం 823 బెర్త్లు ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. కాగా ఈ స్లీపర్ రైలు గంటకు 160 వేగంతో ప్రయాణించేలా అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రయాణ సమయం చాలా తగ్గనుంది. దుర్వాసన లేని టాయిలెట్లు, బయట ఆటోమేటిక్ డోర్లు వంటి అత్యాధునిక సౌకర్యాలను వందే భారత్ స్లీపర్ రైలులో ఏర్పాటు చేయనున్నారు.
కాగా సాధారణ రైళ్ల ఛార్జెస్కు దాదాదు సమాన ఛార్జెస్తో రైల్వే శాఖ వందే సాధారణ్ ఎక్స్ప్రెస్ (Vande Sadharan Express) రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. ఈ రైళ్లు ఇంటర్సిటీ ప్రయాణానికి అనువుగా ఉంటాయి. ఇంకా వీటిలో పగలు-రాత్రి ప్రయాణించవచ్చు. ఈ రైలులో 22 కోచ్లు ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.
కొత్త వందే సాధారణ్ రైలు ఆగస్టు 29న ముంబైలోని వాడి బందర్ యార్డ్కు చేరుకోగా.. నవంబర్ 8న అహ్మదాబాద్, ముంబై మధ్య ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 రూట్లలో వందే సాధారణ్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించగా.. త్వరలో సమీపంలోని నగరాలకు వెళ్లేందుకు వందే మెట్రో రైళ్లను కూడా అభివృద్ధి చేస్తుండటం శుభ పరిణామం.


Click it and Unblock the Notifications








