87 వేలు పెట్టి కొంటే 60 స్పీడ్కే ఇంజిన్ వేడెక్కింది.. చివరకు కంపెనీకే షాక్ ఇచ్చిన బైక్ ఓనర్!
భారతదేశంలో చాలా మందికి బైక్ అంటే కేవలం ఒక వాహనం కాదు.. అది రోజు ఉద్యోగానికి వెళ్లేందుకు, కుటుంబాన్ని నడిపించేందుకు ఉపయోగపడే ముఖ్యమైన ఆస్తి. అలాంటి సమయంలో కొత్తగా కొనుగోలు చేసిన బైక్ మొదటి నుంచే సమస్యలు పెడితే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేరళలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కేరళ రాష్ట్రంలోని చలకుడి తాలూకా కడుకుట్టి గ్రామానికి చెందిన అరుణ్ అనే వ్యక్తి 2021 ఫిబ్రవరి 6న రూ.87 వేల విలువైన కొత్త మోటార్సైకిల్ కొనుగోలు చేశాడు. కొత్త బైక్ తీసుకున్న ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. మొదటి నుంచే బైక్లో అనేక సమస్యలు బయటపడటం మొదలైంది.

అరుణ్ చెప్పిన వివరాల ప్రకారం.. బైక్ను కేవలం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిపినా ఇంజిన్ తీవ్రంగా వేడెక్కేది. దీంతో లాంగ్ రైడ్ చేయడం చాలా కష్టంగా మారింది. పైగా స్పీడోమీటర్ సరిగా పనిచేయకపోవడం, ఫ్యూయల్ గేజ్ తప్పుగా రీడింగ్స్ చూపించడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి.
ఇంతేకాదు.. బైక్కు పెట్రోల్ పోయేటప్పుడు కూడా ఇబ్బందులు వచ్చేవని ఆయన ఆరోపించాడు. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ లోపం వల్ల పెట్రోల్ సరిగా లోపలికి వెళ్లక, బయటకు చిందేదని చెప్పాడు. కొత్త బైక్లో ఇన్ని సమస్యలు రావడంతో అరుణ్ వెంటనే కంపెనీ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్ను సంప్రదించాడు. అయితే అక్కడి సిబ్బంది "ఫస్ట్ సర్వీస్ తర్వాత అన్నీ సరిగ్గా అవుతాయి" అంటూ హామీ ఇచ్చారు.
అరుణ్ కూడా కంపెనీపై నమ్మకం పెట్టుకుని బైక్ను సర్వీస్కు ఇచ్చాడు. కానీ సర్వీస్ పూర్తయ్యాక కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అదే హీటింగ్ సమస్య, అదే కంట్రోల్ ఇష్యూస్ కొనసాగాయి. అంతేకాదు.. 60Km స్పీడ్ దాటితే బైక్పై కంట్రోల్ తగ్గిపోతుందని కూడా ఆయన ఆరోపించాడు. ఇది రోడ్డుపై ప్రమాదకర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

సర్వీస్ సెంటర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో అరుణ్ చివరకు త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. తన ఫిర్యాదుకు బలమైన ఆధారాలు సమర్పించాడు. అత్యంత కీలకంగా.. ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ ద్వారా బైక్ను పరిశీలింపజేశాడు. ఆ నిపుణుడు ఇచ్చిన రిపోర్ట్లో బైక్లో నిజంగానే సాంకేతిక లోపాలు ఉన్నాయని తేలింది.
ఎక్స్పర్ట్ రిపోర్ట్ ప్రకారం.. ఫ్యూయల్ లెవల్ గేజ్ సరిగా పనిచేయడం లేదు. ఫ్యూయల్ ఫిల్లింగ్ సమయంలో పెట్రోల్ వృథా అవుతోంది. 60 Km వేగానికి బైక్ అస్థిరంగా మారుతోంది. ఇంజిన్ అధికంగా వేడెక్కుతోంది. కూలింగ్ సిస్టమ్ సమర్థంగా పనిచేయడం లేదు. ఈ రిపోర్ట్ కేసులో కీలక ఆధారంగా మారింది.
ఈ కేసును త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల కమిషన్ విచారించింది. కమిషన్ అధ్యక్షుడు CT సాబు, సభ్యులు శ్రీజ ఎస్, రామ్ మోహన్ ఆర్ కలిసి కేసును పరిశీలించారు. సర్వీస్ సెంటర్ ఎన్నిసార్లు రిపేర్ చేసినా సమస్యను పరిష్కరించలేకపోయిందని కమిషన్ గుర్తించింది. పైగా డీలర్, కంపెనీ తరఫున సరైన సమాధానం కూడా రాకపోవడంతో కోర్టు వినియోగదారుడి పక్షాన తీర్పు ఇచ్చింది.
చివరకు కంపెనీ అరుణ్కు రూ.20,000 పరిహారం, రూ.10,000 కేసు ఖర్చులు, మొత్తం రూ.30,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. చాలా మంది కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. కానీ ఈ ఘటన ఒక విషయం స్పష్టం చేసింది. వినియోగదారుడికి కూడా చట్టపరమైన హక్కులు ఉంటాయి.
మీరు వాహనం కొనుగోలు చేసిన తర్వాత అన్ని సర్వీస్ బిల్లులు సేవ్ చేసుకోవాలి. సమస్యలు ఉంటే వెంటనే రాతపూర్వకంగా తెలియజేయాలి. అవసరమైతే ఎక్స్పర్ట్ రిపోర్ట్ తీసుకోవాలి. వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించడానికి వెనకాడకూడదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications