Google Maps ను నమ్ముకుంటే ప్రాణాలు పోయాయి.. పాడుబడిన బ్రిడ్డిలోకి దూసుకెళ్లిన కారు.. కేసు వేసిన భార్య
ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్స్(Google Maps) చూపించిన దారిలో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. విరిగిపోయిన బ్రిడ్జిపై నుంచి ప్రయాణించి కిందపడి చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు పరిహారం కోసం గూగుల్ పైన కోర్టులో కేసు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అప్పట్లో మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాల్లంటే దారిలో వారిని వీరిని అడుగుతూ వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ సాయంతో నావిగేట్ చేస్తూ వెళ్తున్నాం. అయితే అన్ని సార్లూ గూగుల్ మ్యాప్స్ సరైన దారి చూపిస్తుందని అనుకుంటే పొరపాటే. ఒక్కోసారి ఆ దారి సరిగ్గా లేకపోవచ్చు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అమెరికాలో ఓ వ్యక్తి ఇలా గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్లి బ్రిడ్జీ పైనుంచి కిందపడి మరణించాడు. ఈ సంఘటన గతేడాది సెప్టెంబర్లో చోటుచేసుకుంది. 2022 సెప్టెంబర్ 30న యూఎస్ నేవీ వెటరన్, మెడికల్ డివైజ్ సేల్స్మ్యాన్గా పనిచేస్తున్న ఫిలిప్ పాక్సన్ వర్షం కురుస్తున్నప్పుడు రాత్రి వేళలో ఇంటికి బయల్దేరాడు.
ఆరోజు తన కూతురు తొమ్మిదో పుట్టిన రోజు కావడంతో తన స్నేహితుడి ఇంట్లో బర్త్డే వేడుకలు ముగించుకొని జీప్ గ్లాడియేటర్లో పాక్సన్ ఇంటికి బయల్దేరాడు. అయితే ఈ క్రమంలో ఇంటికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాడు. గూగుల్ మ్యాప్స్ చూపించిన డైరెక్షన్స్ ప్రకారం జీప్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.

ఈ క్రమంలో దారిలో కూలిపోయిన బ్రిడ్జీ ఉండగా దానిని పాక్సన్ గమనించలేదు. అంతే కాకుండా అక్కడ హెచ్చరికల కోసం బారికేడ్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఒక్కసారిగా కారు 20 అడుగుల ఎత్తులో బ్రిడ్జీపై నుంచి పడిపోయింది. బ్రిడ్జీ కింద ప్రవహిస్తున్న నీటిలో ఫిలిప్ పాక్సన్ మునిగి చనిపోయాడు.
అయితే తన స్నేహితుడి ఇంట్లో బర్త్ డే పార్టీ ముగిసిన అనంతరం భార్యాపిల్లలు ముందుగానే ఇంటికి వెళ్లిపోయారు. ఫిలిప్ పాక్సన్ తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యారు. కానీ దారిలో బ్రిడ్జీ పైనుంచి పడి చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. దీంతో ఆయన భార్య అలీసియా గూగుల్పై కోర్టులో కేసు ఫైల్ చేశారు.

అయితే ఈ ఘటన తర్వాత ఇప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఆ బ్రిడ్జీ కూలిపోయి చాలా ఏళ్లయిందని, అయినా గూగుల్ మ్యాప్స్ ఆ బ్రిడ్జీ పైనుంచి దారి చూపిస్తోందని పాక్సన్ భార్య అలీసియా తెలిపారు. బ్రిడ్జీ పైనుంచి వెళ్లడం సాధ్యం కాదని అనేక మంది గూగుల్ను అప్రమత్తం చేసినా ఆ సంస్థ పట్టించుకోలేదని కంప్లెయింట్లో పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన హికోరీ ప్రాంతంలో నివసించే వ్యక్తి గూగుల్ మ్యాప్స్లో సజెస్ట్ ఏ ఎడిట్ ఫీచర్ని ఉపయోగించి కూలిపోయిన వంతెన గురించి గూగుల్ని చాలాసార్లు హెచ్చరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మార్పును పరీశిలిస్తున్నట్లు గూగుల్ నుంచి రిప్లై వచ్చినా గూగుల్ మ్యాప్స్లో డైరెక్షన్స్ మార్చడానికి ఎలాంటి చర్య తీసుకోలేదని వెల్లడించారు.
భర్త మరణం తర్వాత, గూగుల్ మ్యాప్స్కు ప్రమాదకరమైన వంతెన గురించి మరోసారి అలీసియా తెలియజేశారు. ఆ మార్గంలో పాక్సన్ మరణించినట్లు కూడా పేర్కొన్నారు. అయినా గూగుల్ మ్యాప్స్లో మార్పులు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలల వరకు గూగుల్ మ్యాప్స్లో ఆ వంతెన పైనుంచి నావిగేట్ చేసేలా ఉందని ఆమె అన్నారు.
కాగా అలీసియా లాసూట్పై గూగుల్ సంస్థ స్పందించింది. పాక్సన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ఉందని తెలిపింది. మ్యాప్స్లో ఖచ్చితమైన రూటింగ్ సమాచారాన్ని అందించడమే తమ లక్ష్యమని వెల్లడించంది. ఈ పిల్ను సమీక్షిస్తున్నామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ లాసూట్లో ఆమె ఎంత పరిహారం కోరిందన్న విషయం స్పష్టంగా తెలియదు.


Click it and Unblock the Notifications








