దారుణం.. బాలింతకు సీటు ఇవ్వని ప్రయాణికులు.. చంటిబిడ్డను ఒడిలో పెట్టుకుని ఫుట్ బోర్డుపై ప్రయాణం..
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వ రవాణా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి అంచనాలకు మించి స్పందన రావడంతో బస్సులు మహిళా ప్రయాణికులతో నిండిపోతున్నాయి. కానీ అదే ఇప్పుడు ప్రమాదకర ప్రయాణానికి దారి తీస్తోంది.
పసిబిడ్డను ఒళ్లో కూర్చొ బెట్టుకుని ఓ మహిళ ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై ప్రమాదకరంగా వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటకలో శుక్రవారం(ఆగస్టు 11) న ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోవడంతో తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లాల్సి ఉండగా.. వేరే దారి లేక ఆ మహిళ బస్సు ఫుట్ బోర్డుపై కూర్చుంది.

గదగలో ఓ బస్సులో ఈ దృశ్యం కనిపించింది. చంటి బిడ్డ ఒడిలో ఉన్నా ఆమెకు ఎవరూ సీటు ఇవ్వలేదు. బస్సు పక్కన వెళ్తున్న వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. సిటీ ట్రాన్స్పోర్ట్ బస్సులో కూర్చోవడానికి సీటు దొరకకపోవడంతో ఆ మహిళ ఇలా ప్రయాణించాల్సి వచ్చిందని తెలిసింది.
ఆ మహిళ తన బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చున్నప్పటికీ, తోటి ప్రయాణికులు ఎవరూ కూడా కనికరించి ఆమెకు సీటు ఇవ్వలేదు. భద్రత దృష్ట్యా, బస్సు స్టార్ట్ అయ్యే ముందు డోర్లు మూసేయాలని తెలిసినా డ్రైవర్, కండక్టర్ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత ఆ మహిళ చిన్నారిని ఎత్తుకుని లోపలికి వెళ్లడం వీడియోలో చూడవచ్చు.

గత నెలలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. హులిగి నుంచి కొప్పోలు వెళ్తున్న బస్సు ఫుట్బోర్డ్పై ఓ వృద్ధుడు చిన్నారిని ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చున్నాడు. బస్సు నిండా ప్రయాణికులు ఉండటంతో.. కూర్చోవడానికి స్థలం లేదని.. బస్సు లోపల ఊపిరాడకపోవడంతో.. తాను ఇలా ఫుట్బోర్డుపై కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు.
బస్సు ప్రయాణంలో ఫుట్బోర్డ్పై కూర్చోవడం లేదా నిలబడి ప్రయాణించడం చాలా ప్రమాదకరం. వేగంగా వెళుతున్న సమయంలో బస్సు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ప్రయాణికులు కాలుజారి కింద పడే అవకాశం ఉంది. ఇది ప్రాణాపాయం కావచ్చు. గత జూన్లో హవేరి జిల్లాలో నార్త్-వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC) బస్సు నుండి 14 ఏళ్ల విద్యార్థిని కింద పడి చనిపోయింది.

ఈ ఘటనతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం.. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా బస్సుల డోర్లు మూసేయాలని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి రవాణా సంస్థ సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణికుల భద్రత కోసం కేఎస్ఆర్టీసీ సర్క్యులర్ కూడా జారీ చేసింది. డిపో నుంచి ట్రిప్పుకు బయలుదేరే ముందు బస్సు డోర్లన్నీ చెక్ చేసుకోవాలని సూచించారు.
బస్సు స్టార్ట్ చేసే ముందు బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ ముందు డోర్లతో పాటు వెనుక డోర్లు మూసి ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాతే బస్సు స్టార్ట్ చేయాలి. అలాగే, బస్సు ఫుట్బోర్డ్పై నిలబడి లేదా కూర్చొని ప్రయాణించడానికి ప్రయాణికులను అనుమతించవద్దని బస్సు సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. బస్టాండ్లోని నిర్దేశిత ప్లాట్ఫారమ్లో బస్సు ఆపే వరకు డ్రైవర్ బస్సు డోర్లు తెరవకూడదని సర్క్యులర్లో పేర్కొంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








