Chennai Floods చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్.. కాపాడిన రెస్క్యూ టీం, ఫొటోలు వైరల్
దక్షిణాది రాష్ట్రాల్లో మిచాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లు మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం, అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ వరదల్లో చిక్కుకున్నారు.
మిచాంగ్ బీభత్సానికి దక్షిణాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు వరదల్లో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు, ఇళ్లన్నీ నీట మునగడంతో జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని అధికార యంత్రాంగంతో పాటు రెస్క్యూ టీంలు, ప్రజలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై వరదల్లో అమీర్ ఖాన్ చిక్కుకోవడంతో అతడిని రెస్క్యూ టీం రక్షిస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

అమీర్ ఖాన్ను తమిళనాడు ప్రభుత్వ అధికారులు, తమిళ నటుడు విష్ణు విశాల్ వరద ప్రవాహం నుంచి విముక్తి కలిగించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ను విష్ణు విశాల్ X(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వ కృషి, రెస్క్యూ టీం(Chennai Floods) చేస్తున్న సహాయక చర్యలపై విష్ణు విశాల్ కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేయడంతో ఈ ట్వీట్పై ఆ రాష్ట్ర మంత్రి ఆర్బీ రాజా ధన్యవాదాలు తెలిపారు.
విష్ణు విశాల్ ట్వీట్ చేస్తూ.. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులకు నటుడు ధన్యవాదాలు తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయిన చాలా మందిని అధికారులు, ప్రభుత్వ సిబ్బంది కాపాడారని చెప్పారు. కాగా ఇప్పటికే మూడు పడవల్లో బాధితులను తరలిస్తున్నారని.. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు తమిళనాడు ప్రభుత్వం స్పందించిన తీరు అద్బుతంగా ఉందన్నారు.

చెన్నై వరదల్లో బోట్లో రెస్క్యూ సిబ్బందితో అమీర్ ఖాన్(Aamir Khan Rescued In Chennai Floods) ఉన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నిరాడంబరమైన, సాధారణమైన మనిషి అని.. తనతో పాటు వరదల్లో చిక్కుకున్న వారిని తరలించేవరకు ఆయన కూడా ఎంతో ఓపికగా ఎదురుచూశారని మంత్రి పేర్కొన్నారు.
కాగా విష్ణు విశాల్ షేర్ చేసిన ఫొటోలను పరిశీలిస్తే.. అమీర్ ఖాన్తో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాను కూడా చూడవచ్చు. అయితే వరదల సమయంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చెన్నైలో ఎందుకు ఉన్నాడనే అనుమానం మీకు రావచ్చు. అమీర్ తల్లి గత కొన్ని నెలలుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు తోడుగా ఉండేందుకు అమీర్ అక్కడే ఉంటున్నారు.
ఈ క్రమంలో అమీర్ ఖాన్తో పాటు పలువురు వరదల్లో చిక్కుకొన్నారనే సమాచారం అందిన వెంటనే ఫైర్ అండ్ రెస్క్యూ అధికారులు సహాయచర్యల్లో పాల్గొన్నారు. వారితో పాటు హీరో విష్ణు విశాల్ కూడా సహాయ కార్యక్రమాల్లో తన వంతు కృషి చేశారు. దాదాపు మూడు పడవల్లో వెళ్లి అమీర్ ఖాన్తో పాటు పలువురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఇటీవల, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా వరద బాధితులను తరలించిన షెల్టర్లను సందర్శించినట్లు సమాచారం. వారికి బట్టలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి వారితో కాసేపు మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాగా భారీ వరదల కారణంగా తమిళనాడులో భయాందోళనకు గురయ్యే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
చెన్నై పరిధిలో ఓ వరద ప్రాంతంలో భారీ మొసలి రోడ్డును దాటుతున్న వీడియో X లో వైరల్ అయింది. ఈ వీడియోలో, మొసలి రోడ్డు మధ్యలో నుండి మరొక వైపు పొదల్లోకి వెళుతున్నట్లు కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో.. అధికారులు VIT మరియు నెడుంగుండ్రం సరస్సులోని నీటి వనరుల దగ్గరకు వెళ్లవద్దని స్థానికులను అప్రమత్తం చేశారు.


Click it and Unblock the Notifications








