డ్రైవరన్నలకు శుభవార్త.. ఇకపై లారీలు, డీసీఎంలు, భారీ ట్రక్కులలో ఏసీ తప్పనిసరి.. హ్యాపీ జర్నీ!!
భారత్లో సరుకు రవాణా చేసే వాహనాల పాత్ర చాలా కీలకం. అధిక శాతం ట్రక్కులు (లారీలు, డీసీఎం) ఇతర పెద్ద పెద్ద వాహనాల ద్వారానే సరుకు రవాణా జరుగుతుంది. నిత్యం రోడ్లపై సరుకులను తరలిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి ఈ ట్రక్కులు (డ్రైవర్లు) ఎనలేని కృషి చేస్తున్నాయి.
ఇకపై రోడ్డుపై తిరిగే గూడ్స్ ట్రక్కులకు ఏసీ తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీని ప్రకారం ఎన్- 2 (3.5 టన్నుల కంటే ఎక్కువ కెపాసిటీ) , ఎన్-3(12 టన్నుల కెపాసిటీ) కల్గిన ట్రక్కులకు ఏసీని తప్పనిసరి చేశారు.

దేశంలే ఇప్పటి వరకు కేవలం కార్లు మరియు బస్సులతో సహా ప్రజా రవాణా పరికరాలకు మరిన్ని భద్రతా ఫీచర్లపై చట్టాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ట్రక్కులు వంటి గూడ్స్ వాహనాల భద్రత, వాటిని నడిపే వ్యక్తులకు సౌకర్యాలపై ఎలాంటి చట్టాలు లేవు.
భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా చాలా మంది ట్రక్ డ్రైవర్లు విపరీతమైన వేడి మరియు విపరీతమైన చలిలో పనిచేస్తున్నారు. డ్రైవర్, క్లీనర్ ఉన్న ప్రాంతంలో ఏసీని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో తెలిపారు. దానికి అనుగుణంగా ఈ ప్రతిపాదనను ఆయన తీసుకువచ్చారు.

ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన ఇటీవల ట్విటర్ లో పేర్కొన్నారు. దీని ప్రకారం భారత్ లో తిరిగే ఎన్ 2, ఎన్ 3 ట్రక్కులకు క్యాబిన్లలో ఏసీని తప్పనిసరి చేయాలని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. కొత్త ట్రక్కులను తయారు చేసే కంపెనీలు ఆ పని చేయాలని, నాన్ ఏసీ ట్రక్కులను అమ్మకానికి తీసుకురావద్దని పేర్కొంది.
ఇది 2025 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అప్పటికి లారీ తయారీదారులు ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వారు ప్రస్తుతం సిద్ధం చేస్తున్న డిజైన్ లో అవసరమైన ఇతర అంశాలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ గడువు ఇచ్చారు. మరో పదిహేను రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
భారతదేశంలో గూడ్స్ ట్రక్కులను సాధారణంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. దీనిని ఎన్ 1, ఎన్ 2, ఎన్ 3 అని పిలుస్తారు. ఎన్-1 గరిష్టంగా 3.5 టన్నుల సరుకును మోసుకెళ్లగలదు.ఇక ఎన్2 ట్రక్కుల విషయానికొస్తే 3.5 టన్నుల నుంచి 12 టన్నుల వరకు బరువున్న సరుకులను తీసుకెళ్తారు. ఎన్ 3 ట్రక్కుల విషయానికొస్తే, అవి 12 టన్నుల కంటే ఎక్కువ బరువున్న సరుకులను తీసుకెళ్లే సామర్థం ఉంటుంది.
ఇందులో ఎన్ 2, ఎన్ 3 ట్రక్కులకు మాత్రమే ఏసీని తప్పనిసరి చేశారు. అంటే ఈ ట్రక్కులన్నీ సరుకులను బల్క్ గా తీసుకెళ్లడానికి, దూర ప్రాంతాలకు వెళ్లడానికి తిరుగుతున్నాయని, ఈ ట్రక్కులకు ఏసీ తప్పనిసరి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించబోతోంది.
దీనిపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. భారతదేశంలో రహదారి భద్రతలో ట్రక్ డ్రైవర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. రోడ్డుపై ఎక్కువగా ప్రయాణించేది వీరే అని అన్నారు. ట్రక్ డ్రైవర్లకు సౌకర్యవంతమైన పని పరిస్థితులను కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
ప్రజలు తమ రోజువారీ అవసరాలను పొందాలంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సరుకుల్ని తరలించాల్సిన అతి ముఖ్యమైన అంశాలలో ట్రక్కులు కీలకం. సరుకుల రవాణాలో ట్రక్కులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో, దేశీయ సరుకు రవాణాలో ఎక్కువ భాగం ట్రక్కులలో జరుగుతుంది. ఈ నిర్ణయంపై ట్రక్కు డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








