ఇకపై ఆ వాహనాల్లో సీట్ బెల్ట్ తప్పనిసరి.. లేదంటే AI కెమెరాల్లో చిక్కుకుంటారు..
రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడా ట్రాఫిక్ నింబంధనలు ఉల్లంఘించకుండా ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరాలను ఉపయోగిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వీటిని అమర్చారు.
కేరళలో జూలై 5 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని గుర్తిస్తున్నారు. తాజాగా తిరువనంతపురంలో రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు అధ్యక్షతన ఏఐ కెమెరాల పనితీరుకు సంబంధించి సమీక్షా సమావేశం జరిగింది. నెల రోజుల్లోనే 19 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, వీఐపీలు సహా 32 లక్షల మందికిపైగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్టు గుర్తించినట్లు మంత్రి చెప్పారు.

ఒక ఎంపీ ఆరుసార్లు, ఒక ఎమ్మెల్యే ఏడుసార్లు ట్రాఫిల్ రూల్స్ పాటిచకుండా కెమెరాలకు చిక్కారని వెల్లడించారు. 328 ప్రభుత్వ వాహనాలు సైతం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లు చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారందరికీ ఈ-చలాన్లు జారీ చేశామని తెలిపారు. అయితే, కెమెరాలకు చిక్కిన ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో సీటు బెల్టు లేకుండా నడిచే లారీలు, బస్సుల పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ నిబంధనను ఉల్లంఘించిన వాహనాలపై ఏఐ కెమెరాలు నిఘా ఉంచనున్నాయి. సీటు బెల్టు లేకుండా భారీ వాహనాలు వెళ్లకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ వాహనాలకు ఏఐ కెమెరాలు జరిమానా విధించనున్నాయి.

కేరళ రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్డీఓలు, జాయింట్ ఆర్టీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ఏఐ కెల్ట్రాన్ కెమెరాల్లో ఈ అధునాతన సాంకేతికతను సైతం జోడించారు. టూ వీలర్, త్రీ వీలర్ మినహా మిగతా అన్ని హెవీ వెహిల్స్లో సీటు బెల్టులను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చాలా వరకు మధ్య, భారీ తరహా వాహనాల్లో డ్రైవర్, ముందు సీటు ప్రయాణికులు సీటు బెల్టు లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్టీవోలను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలకు భారీ వాహనాలు కూడా ఓ కారణమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి భారీ వాహనాల డ్రైవర్లు, ముందు సీటు ప్రయాణికులకు సీటు బెల్టు తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు ప్రకటించారు. ఈ మేరకు కేఎస్ఆర్టీసీకి ఆదేశాలు జారే చేశారు. అయితే చాలా వరకు ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్లు సీటు బెల్టులు లేకుండా వాహనాలు నడుపుతున్నారు.
లారీలు, బస్సులు, టూరిస్ట్ కాంట్రాక్ట్ క్యారేజీల డ్రైవర్లతో పాటు డ్రైవర్కు ఎడమవైపు కూర్చున్న వారికి ప్రభుత్వం సీటు బెల్టులు తప్పనిసరి చేసింది. నాన్ క్యాబిన్ బస్సుల్లోని డ్రైవర్లకు మాత్రమే సీటు బెల్టులు వర్తిస్తాయి. లారీల్లో డ్రైవర్, హెల్పర్ తప్పనిసరి సీటు బెల్టు ధరించాలి.
ప్రస్తుతం, కార్లు, మోటో క్యాబ్ల్లో సీటు బెల్టులు లేకుండా నడిపితే ఏఐ కెమెరాలు రూ. 500 జరిమానా విధిస్తున్నాయి. ఏఐ కెమెరాను ప్రవేశపెట్టిన తర్వాత కన్నూర్ జిల్లాలో అత్యధిక జరిమానాలు సీటు బెల్టు ధరించని కేసులే ఉన్నాయి. జూన్లోనే 8,728 కేసులు నమోదయ్యాయి. దీంతో భారీ వాహనాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ట్రాఫిక్ నిఘా వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు వెల్లడించారు. 1994 నుంచి రిజిస్టరైన అన్ని వాహనాలకు సీటు బెల్టు తప్పనిసరి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి భారీ వాహనాలు నడిపే డ్రైవర్లతో పాటు క్యాబిన్ ప్రయాణికులకు సీటు బెల్టును తప్పనిసరి చేస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications








