ఎయిర్ ఇండియా తొలి ఎయిర్బస్ ‘a350' సింగపూర్ టు ఫ్రాన్స్.. ఆసక్తికర విషయాలెన్నో.!!
భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. సింగపూర్లో తన తొలి A350 విమానం కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ ఇండియా నుంచి వస్తున్న తొలి విమానం A350 గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో..
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన, అతిపెద్ద విమానంగా ప్రస్తుతం A350-900 ఉంది. ఈ తరహా విమానాల శ్రేణిని తమ ఎయిర్లైన్ సర్వీస్లో చేర్చుకోవాలని ఇప్పటికే చాలా ప్రముఖ విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. కాగా కొన్ని విమానయాన సంస్థలు ఇప్పటికే తమ ఫ్లీట్లో A350లను కలిగి ఉన్నప్పటికీ.. అదనంగా మరికొన్ని A350లను కొనుగోలు చేస్తున్నాయి.

కొన్ని ఉదాహరణలను తీసుకుంటే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్ సర్వీసెస్.. ఇటీవల 15 కొత్త A350-900 విమానాలను ఆర్డర్ చేసింది. ఇందుకు సంబంధించి ఇటీవల దుబాయ్లో జరిగిన ఎయిర్షోలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. త్వరలో ఈ విమానాలు దుబాయ్లో అందుబాటులోకి రానున్నాయి.
అయితే భారత్కు చెందిన ఎయిర్ ఇండియా తన మొదటి A350 విమానాన్ని తాజాగా ప్రారంభించింది. నవంబర్ 18న సింగపూర్ నుంచి ఫ్రాన్స్లోని టౌలౌస్కు ఎయిర్ ఇండియా యొక్క మొట్టమొదటి A350 విమాన సర్వీసును మొదటిసారిగా నిర్వహించారు. తన అధికారిక X(గతంలో ట్విట్టర్) పేజీలో ఎయిర్ ఇండియా సంబంధిత చిత్రాలతో ధ్రువీకరించింది.

భారత్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎయిర్బస్ A350-900.. సింగపూర్ నుంచి టౌలౌస్కు కొత్త 'ఎయిర్ ఇండియా' లివరీలో తన తొలి విమాన సర్వీస్ను ప్రారంభించిందని ఎయిర్ ఇండియా X లో పేర్కొంది. కానీ వాస్తవానికి ఈ సర్వీస్ను ట్రయల్ రన్లా ప్రారంభించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ట్రిప్లో ఫ్లైట్ సిబ్బంది తప్ప, ప్రయాణికులెవరూ ఎక్కలేదు.
కాగా ఎయిర్ ఇండియా నుంచి అందిన సమాచారం ప్రకారం సింగపూర్లో ఎయిర్ ఇండియా యొక్క మొదటి A350 విమానానికి కొత్త Air India' పెయింట్ లివరీ పూర్తయింది. దీని తరువాత, ఎయిర్ ఇండియా యొక్క A350 విమానం.. అదనపు పనుల కోసం ఫ్రాన్స్లోని టౌలౌస్కు వెళ్లింది.

టౌలౌస్లో అన్ని పనులు పూర్తయిన తర్వాత, ప్రయాణికులతో మొదటి ఎయిర్ ఇండియా A350 విమానం 2023 డిసెంబర్లో అధికారికంగా ప్రారంభం కానుంది. కాగా భవిష్యత్తులో మరిన్ని A350 విమానాలను ఉపయోగించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. ఇందుకోసం ఎయిర్ ఇండియా ఇప్పటికే దాదాపు 40 ఎయిర్ బస్ ఏ350 విమానాల కోసం ఆర్డర్ చేసినట్లు సంస్థ తెలిపింది.
ఈ 40 A350 విమానాల్లో 6 A350-900 విమానాలు కాగా.. మరో 34 A350-1000 విమానాలు ఉన్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది. 6 A350-900 ఎయిర్క్రాఫ్ట్లలో మొదటిది వచ్చే డిసెంబరులో సర్వీసు ప్రారంభించనున్నట్లు సమాచారం. మిగిలిన 5 A350-900 విమానాలు మార్చి 2024 నాటికి ఎయిర్ ఇండియా ప్రయాణికులకు వరుసగా సేవలందించనున్నాయి.

X లో ఎయిర్ ఇండియా విడుదల చేసిన చిత్రాలను పరిశీలిస్తే.. 'Air India' స్టిక్కర్లతో కూడిన దిగ్గజం A350ని చూడగానే ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇది ఎయిరిండియా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని నెటిజన్లు అంటున్నారు. ప్రయాణికులకు ఆధునికమైన, గొప్ప ప్రయాణ అనుభూతిని అందించాలని ఎయిర్ ఇండియా భావిస్తున్నట్లు దీన్ని ద్వారా స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications








