Air India A350: ఢిల్లీ చేరుకున్న కొత్త ఎయిర్బస్ A350.. స్వాగతం పలికిన ఎయిర్ ఇండియా, ఏంటీ దీని ప్రత్యేకత!!
ఎయిర్ ఇండియా(Air India)కు చెందిన ఎయిర్బస్ A350- 900 తొలి విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. శనివారం(డిసెంబర్ 23) దేశ రాజధానికి చేరుకున్న ఈ A350- 900 విమానానికి ఎయిర్ ఇండియా ఘన స్వాగతం పలికింది. ఈ విమానం ప్రత్యేకతలేంటి.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్బస్ A350(Air India A350) తొలి విమానం డిసెంబర్ 23, శనివారం భారత్కు చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ విమానానికి ఎయిర్ ఇండియా ఘన స్వాగతం పలకగా.. ఆకర్షణీయమైన లోగోతో కొత్త లుక్లో ఈ ఎయిర్ ఇండియా ఏ350 విమానాన్ని రూపొందించారు. ఈ సమాచారాన్ని ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి క్యాంప్బెల్ విల్సన్ ధ్రువీకరించారు.

ఈ విమానంలో సిబ్బంది కోసం కొత్తగా యూనిఫాంను డిజైన్ చేయగా.. ఈ కొత్త విమానం వద్ద సిబ్బంది ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సరికొత్త ఎయిర్బస్ A350 విమానానికి సంబంధించిన ఫొటోలను ఎయిర్ ఇండియా అధికారిక X(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఎయిర్ ఇండియా తన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో Airbus A350-900ని జోడిస్తోంది. మొదటి దశలో, ఇది ఆరు ఎయిర్బస్ A350-900 విమానాలను తీసుకురానుంది. కాగా ఎయిర్ ఇండియా ఇటీవల ఎయిర్బస్, బోయింగ్ నుంచి దాదాపు రూ. 6.5 లక్షల కోట్ల వ్యయంతో 740 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ఇందులో ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ నుంచి 250 విమానాలను కొనుగోలు చేస్తుండగా.. అమెరికాకు చెందిన బోయింగ్ నుంచి 220 విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్ పెట్టింది. ఈ క్రమంలో ఎయిర్బస్ నుంచి తొలి విమానానికి ఎయిర్ ఇండియా ఢిల్లీలో ఘన స్వాగతం పలికింది.
కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎయిర్ ఇండియా విమానాలను కొనుగోలు చేస్తోంది. 2005లో చివరిసారిగా బోయింగ్ నుంచి 68, ఎయిర్బస్ నుంచి 43 విమానాలను కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియా.. జనవరి నుంచి A350 విమానాలను నడుపనున్నట్లు సమాచారం. అయితే విమానం ప్రయాణానికి ముందు కొన్ని గైడ్లైన్స్ను పాటించాల్సి ఉంటుంది.

కస్టమ్స్ క్లియరెన్స్, డీజీసీఏ తనిఖీలు, ప్రూవింగ్ ఫ్లైట్లతో సహా అనేక పోస్ట్-అరైవల్ రెగ్యులేటరీ ప్రక్రియలను ఎయిర్ ఇండియా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రయాణికులతో వెళ్లడానికి ముందు విమానం సర్టిఫికేషన్ను సైతం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయితే 2024 మధ్య నాటికి ఆరు సర్వీసులతో ఏ350 విమానాలను నడపాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది.
ఎయిర్బస్ A350-900 అనేది వైడ్ బాడీ విమానం. ఇది భారతదేశపు మొట్టమొదటి వైడ్ బాడీ విమానంగా నిలవనుంది. ఎందుకంటే.. ఇండియన్ ఎయిర్లైన్ విభాగంలో ఇంత వైడ్ బాడీ ఎయిర్క్రాఫ్ట్ మరే కంపెనీకి లేదని చెబుతున్నారు. అయితే తొలి దశలో ఈ విమానాన్ని స్వల్ప-దూర మార్గాల్లో మాత్రమే నడపనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.
దీని తరువాత, విమానాలను సుదూర మార్గాల్లో వినియోగించనున్నారు. ఎయిర్బస్ A350-900 ఒకేసారి 300-350 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదని కంపెనీ పేర్కొంది. ఇది నాన్స్టాప్గా 18 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదని సమాచారం. మరింత స్థలం మరియు విలాసవంతమైన ఫ్లయింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ విమానాన్ని రూపొందించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
ఎయిర్బస్ A350-900 ను ఆ మేరకు ప్రపంచ స్థాయి విమానంగా రూపొందించారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, భారత్లో A350 విమానాలను నిర్వహించడానికి ఇప్పటికే అనుమతిని కలిగి ఉంది. ముఖ్యంగా బడ్జెట్ ధరకే ఎయిర్ ఇండియా ఈ విమానం ద్వారా రవాణా సేవలను అందించాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications








