భారత్లో ఒకే ఒక్క మహిళ!.. ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మండే మోటివేషన్ పేరుతో.. ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్ చూసినట్లయితే.. అందులో ఓ బామ్మ (వృద్ధ మహిళ) కనిపిస్తారు. అయితే ఈమె ఇతర మహిళల మాదిరిగా కాదు, ఏడు పదుల వయసు దాటినా ఏకంగా 11 రకాల వాహనాలను డ్రైవ్ చేయడానికి కావలసిన డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఇది వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఇది నిజం. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన 'రాధామణి'.

నిజానికి రాధామణి పేరు చాలా సార్లు, చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఎందుకంటే 73 ఏళ్ల వయసులో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. కొచ్చిలో 1970లో తన భర్త 'లలన్' డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించారు. అయితే 2004లో ఆయన మరణించారు. భర్త పోయిన బాధ ఉన్నప్పటికీ.. ఆయన ప్రారంభించిన డ్రైవింగ్ స్కూల్ బాధ్యతలను తాను స్వీకరించింది. నేటికీ A టు Z డ్రైవింగ్ స్కూల్ బాధ్యతలను ఈమె స్వయంగా నిర్వహిస్తున్నారు.
1984లో మొట్ట మొదటి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మహిళగా రికార్డ్ క్రియేట్ చేసిన రాధామణి ఇప్పుడు సాధారణ కార్లు, స్పోర్ట్స్ కార్లు మాత్రమే కాకుండా హెవీ వెహికల్స్, జేసీబీలు, ప్రాక్లేయినర్స్ వంటివి కూడా అవలీలగా డ్రైవ్ చేస్తున్నారు. వీటికి కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఈమె కలిగి ఉన్నారు. 1981లో ఈమె అంబాసిడర్ డ్రైవ్ చేయడం మొదలెట్టి ఈ రోజు ఈ స్థాయికి చేరారు.
డ్రైవింగ్ చేయడంలో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్న రాధామణి 'ఇన్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022' పురస్కారాన్ని కూడా కైవసం చేసుకున్నారు. తన భర్త ప్రారంభించిన డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తూనే.. ఎంతోమందికి డ్రైవింగ్ గురించి వివరిస్తూ.. లింగ బేధం లేకుండా డ్రైవింగ్ అనుభవనాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే రాధామణి అతి తక్కువ కాలంలోనే గొప్ప ఖ్యాతి పొందారు, ఎంతోమందికి రోల్ మోడల్ అయ్యారు.
రాధామణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా అభిమానులకు చేరువయ్యారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో జేసీబీలు, క్రేన్స్, సూపర్ కార్లు మాత్రమే కాకుండా ట్రాక్టర్లు, పెద్ద పెద్ద ట్రక్కులను కూడా డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఎంతోమంది చేత సత్కరించబడిన ఈమెను ఇప్పుడు ఆనంద్ మహీంద్రా ఎంతగానో మెచ్చుకున్నారు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో రాధామణి ఫోటో షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెట్స్ చేస్తున్నారు. నిజానికి మహిళలు చాలావరకు టూ వీలర్ లేదా.. ఫోర్ వీలర్ డ్రైవ్ చేయడం వరకు మాత్రమే నేర్చుకుంటారు. కృషితో పట్టు వదలకుండా భారీ వాహనాలను కూడా డ్రైవ్ చేయడం నేర్చుకున్న మహిళలు చాలా అరుదుగా ఉంటారని తెలుస్తోంది. అందులో చెప్పుకోదగ్గ పేరు రాధామణి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








