బాబూ నీ తెలివికి జోహార్లు: మద్యం అక్రమ రవాణాపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
డ్రై స్టేట్ అయిన గుజరాత్లో ఓ పికప్ ట్రక్కు క్రింది భాగంలో ప్రత్యేకమైన కంపార్ట్మెంట్ను తయారు చేసి, అందులో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇప్పుడా ఆ వీడియో కాస్తా వైరల్గా మారి, అందరి కంటపడింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లంతా, అసలు మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

తాజాగా ఈ వీడియోపై పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా కనిపించే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా, ఈ వీడియోపై కామెంట్ చేస్తూ, దానిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
అక్రమ మద్యం రవాణా కోసం పికప్ ట్రక్కును మోడిఫై చేసిన తీరుపట్ల ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా ట్రక్కులో ఓ రహస్య కంపార్ట్మెంట్ను రూపొందించడం చాలా తెలివైన పని అని, పేలోడ్ అనే పదానికి ఇది పూర్తి నిర్వచనాన్ని ఇస్తుందని, తాము ఇలాంటి వాటిని తయారు చేయలేమని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఈ వీడియో గురించి ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానిస్తూ, "ఈ సంఘటన చాలా తెలివిగా జరిగింది. ఇది పేలోడ్ యొక్క నిర్వచనాన్నే మార్చివేసింది, కాని ఈ రకమైన సామర్థ్యం మహీంద్రా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్లో భాగం కాదు, ఎప్పటికీ ఉండదని నేను హామీ ఇస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

గుజరాత్ పోలీసులకు లభించిన పక్కా సమాచం ప్రకారం, స్పెషల్ డ్రైవ్ నిర్విహంచి ఈ మినీ ట్రక్కును పట్టుకున్నారు. ఈ ట్రక్ చూడటానికి చాలా సాధారణగా కనిపిస్తుంది. కానీ, దాని వెనుక డోరు క్రింది భాగంలో ఓ ప్రత్యేమైన అర ఉంది. ఆ అరను పూర్తిగా బయటకు లాగడానికి నలుగురు వ్యక్తుల సాయం అవసరమైంది.

పికప్ ట్రక్కు క్రింది భాగంలో ఉన్న ఈ అరలో అనేక వందల మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. వీటిలో ప్రీమియం బ్రాండ్ లిక్కర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఎంత మొత్తంలో బాటిళ్లను స్వాదీనం చేసుకున్నది, వాటి విలువ ఎంత అనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.

గుజరాత్ రాష్ట్రంలో మద్యపానం పూర్తిగా నిషేధించబడింది. అక్కడ మద్యం విక్రయించడం వినియోగించడం రెండూ నేరంగా పరిగణించడం జరుగుతుంది. అయితే, మందుబాబుల వీక్నెస్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు దుండగులు ఇలా అక్రమ మార్గంలో పొరుగు రాష్ట్రాల నుండి మద్యం రవాణా చేస్తుంటారు. దీనిపై పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఉంచారు.

ఈ విషయంపై ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ కూడా బాగానే వైరల్ అయ్యింది. ఎంతో మంది ట్విట్టర్ యూజర్లు ఆయన చేసిన ట్వీట్ని రీట్వీట్ చేసి వైరల్ చేశారు. ఎంతటి తెలివైన దొంగైనా ఏదో ఒక సందర్భంలో దొరికిపోతాడు అనేది తాజా సంఘటనే నిలువెత్తు నిదర్శం.


Click it and Unblock the Notifications