ఆస్టన్ మార్టిన్ వన్-77 కార్లలో ఒక కారు ఢమాల్..!
బ్రిటీష్ లగ్జరీ కార్ మేకర్ 'ఆస్టన్ మార్టిన్' అందిస్తున్న అత్యంత ఖరీదైన కారు ఆస్టన్ మార్టిన్ వన్-77. సుమారు రూ.20 కోట్లకు పైగా వెల కలిగిన ఈ లగ్జరీ కారు ఇటీవలే చైనాలో ప్రమాదానికి గురై నుజ్జునజ్జయింది. అయితే, ఇందులో ఉన్న సురక్షితమైన భద్రతా ఫీచర్ల కారణంగా, కారు డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బ్రతికి బయటపడ్డట్లు సమాచారం. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
గడచిన 2008లో జరిగిన ప్యారిస్ మోటార్ షోలో ఆస్టన్ మార్టిన్ ఈ 2-డోర్ స్పోర్ట్స్ కూపేను ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కార్లు కేవలం 77 మాత్రమే ఉన్నాయి. ఇందులో చివరి కారు (77వ 'వన్-77' కారు) ఈ ఏడాది ఆరంభంలోనే అమ్ముడైంది. ఆస్టన్ మార్టిన్ కేవలం 77 యూనిట్ల 'వన్-77' కార్లను మాత్రమే తయారు చేసింది. అత్యంత శక్తివంతమైన 7.3 లీటర్, వి12 ఇంజన్తో ఈ కారును రూపొందించారు.
ఆస్టన్ మార్టిన్ వన్-77 కారు గరిష్టంగా 750 బిహెచ్పిల శక్తిని (బాప్రే...) విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 357 కి.మీ. ఈ కారు బరువు తక్కువగా ఉంచేందుకు గానూ దీని బాడీని తేలికపాటి అల్యూమినియం, ధృడమైన కార్బన్ఫైబర్ మెటీరియల్స్తో తయారు చేశారు. దీని మొత్తం బరువు 1500 కిలోలు మాత్రమే.
ఆస్టన్ మార్టిన్ కంపెనీ గురించి:
ఆస్టన్ మార్టిన్ కంపెనీకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ఏటా 8,000 కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఆస్టన్ మార్టిన్కు 42 దేశాల్లో 134 డీలర్లు ఉన్నారు. లియోనెల్ మార్టిన్ 1914లో మరియు రాబెర్ట్ బామ్ఫోర్డ్లు ఆస్టన్ మార్టిన్ స్థాపించారు. 1994 నుంచి 2007 వరకూ ఈ కంపెనీ అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్లో భాగంగా ఉండేది.
2007లో ఆస్టన్ మార్టిన్ కంపెనీ ఫోర్డ్ నుండి విడిపోయింది. గడచిన సంవత్సరంలో ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న సిగ్నెంట్ మినహా బేసిక్ మోడల్ వీ8 వ్యాంటేజ్ నుంచి ఆల్ట్రా-ఎక్స్క్లూజివ్ కారు వన్-77 వరకూ అన్ని మోడళ్లను భారత్కు పరిచయంచేసింది. ఆస్టన్ మార్టిన్ వన్-77 కారు ప్రస్తుతం భారత్లోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారు.


Click it and Unblock the Notifications








