Atal Setu Bridge టూరిస్ట్ స్పాట్లా మారిన 'అటల్ సేతు' బ్రిడ్జి.. చెత్తాచెదారం చూసి ఖంగు తిన్న పోలీసులు
ముంబయి- నవీ ముంబయి అనే రెండు నగరాల మధ్య అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతు(Atal Setu)ను గత శుక్రవారం(జనవరి 11)న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అత్యాధునిక సాంకేతికతతో దాదాపు రూ. 17,000 కోట్లకు పైగా బడ్జెట్తో దీనిని నిర్మించారు. కాగా ఇటీవల ఈ వంతెన గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ముంబయి - నవీముంబయి(Trans Harbour Link) నగరాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సముద్రం మీదుగా నిర్మించిన అటల్ సేతు వంతెనను ప్రారంభించి వారమైనా గడవలేదు. అప్పుడే ఈ వంతెనపై చెత్తాచెదారం దర్శనమివ్వడం ఇతర వాహనదారులతో పాటు ముంబయి ట్రాఫిక్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దాదాపు 22 కి.మీ మేర నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు టూరిస్ట్ స్పాట్లా మారడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలోనే తొలిసారిగా రూ. 17,843 కోట్లతో ముంబయిలో అటల్ సేతు ట్రాన్స్హార్బర్ లింక్ను నిర్మించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం దీనికి 'అటల్ సేతు' అని నామకరణం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి దాదాపు ఐదేళ్లు సమయం పట్టింది. ప్రధాని మోదీ దీనిని జాతికి అంకితం చేశారు. కాగా ఈ అందమైన సముద్రపు వంతెనపై ఇప్పుడు చెత్తాచెదారం కనిపించడం నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు(Selfies On Atal Setu Bridge) సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా కొంతమంది ఈ బ్రిడ్జిని టూరిస్ట్ స్పాట్గా వినియోగించుకుంటున్నట్లు పోలీసుల దృష్టికి చేరుకుంది. ఇంకా కొంతమంది స్థానికులు ఈ వంతెనపై సెల్ఫీలు, వీడియో రీళ్లు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే నాన్స్టాప్ హైవేగా నిర్మించిన ఈ సీ బ్రిడ్జిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

అంతేకాకుండా ఇది ముంబయి పోలీసులకు పెద్ద తలనొప్పిగా కూడా మారింది. అయితే ఇది వెహికల్ ట్రాఫిక్ ట్రాక్ కాబట్టి ఇది సరైన చర్య కాదని వాహనదారులు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ బ్రిడ్జిపై ప్రయాణించే వాహనాలకు అధికారులు నిర్ధిష్ట ఫీజు వసూలు చేస్తారు. కానీ వాహనదారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదు. దీన్ని నియంత్రించేందుకు నిబంధనలను అతిక్రమించే వాహనదారులపై ముంబయి నగర పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
ముఖ్యంగా బ్రిడ్జిపై వాహనాలను ఆపి సెల్ఫీలు దిగి ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వారిపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఇతర వాహనాలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ వంతెనపై ఇలాంటి కార్యకలాపాలను నివారించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టూరిస్టులు(Tourists On Atal Setu Flyover), మరికొందరు వాహనాదారులు ఈ బ్రిడ్జిపై ఆగినప్పుడు వ్యర్థాలను వంతెనపైనే విసిరేస్తున్నారు. వాహనాలను రోడ్డు పక్కగా పార్క్ చేసి సెల్ఫీలు వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలో అనవసరంగా వాహనాలను పార్కింగ్ చేసే వారిపై ముంబయి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 264 వాహనాలపై జరిమానా విధించినట్లు సమాచారం.
ఇలా బ్రిడ్డిపై వాహనాలు నిలిపిన యజమానులకు రూ. 500 చొప్పున జరిమానా విధించారు. కాగా ఈ ఫ్లై ఓవర్పై ముంబయి పోలీసులు ఇప్పటికే కొన్ని పరిమితులు విధిస్తున్నారు. 100 కి.మీ పరిమిత వేగం మాత్రమే మెయింటైన్ చేయాలి. అయితే బ్రిడ్జి స్టార్టింగ్, ఎండింగ్లో 40 కి.మీ వేగంతో మాత్రమే వాహనాలు నడపాల్సి ఉంటుంది.
కాగా ఈ ఫ్లైఓవర్పై మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, ఆటోలకు అనుమతి లేదు. అదేవిధంగా, మల్టిపుల్ యాక్సిల్స్తో కూడిన ట్రక్కులు మరియు బస్సులను ఈ మార్గంలో నిషేధించారు. దీన్ని అనుసరించి ముంబయి పోలీసులు త్వరలో సముద్ర వంతెనపై సెల్ఫీలు, వీడియోలను నిషేధిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








