విమానం కూలిపోయింది, కానీ అందులో ప్రయాణిస్తున్న వారీ ఆచూకీ లేదు.. అదొక "ఘోస్ట్ ప్లేన్"..!
జర్మనీలో ల్యాండ్ కావాల్సిన నలుగురితో ప్రయాణిస్తున్న ఓ ఆస్ట్రియన్ ప్రైవేట్ జెట్ రాడార్ నుండి తప్పిపోయి, ఆదివారం నాడు లాట్వియాలో క్రాష్ అయినట్లు గుర్తించారు. ఈ విమానం, కంట్రోల్ రూమ్తో డిస్కనెక్ట్ అయి ఐరోపా అంతటా ప్రయాణించడం కొనసాగించింది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సంప్రదింపులు జరపడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Recommended Video
ప్రమాదానికి గురైన విమానం పేరు సెస్నా 551. సాధారణంగా, ఇందులో ఇద్దరు సిబ్బందితో పాటుగా ఆరు నుండి ఎనిమది మంది ప్రయాణీకులు కూర్చోగల సామర్థ్యం ఉంటుంది. కాగా, ఈ ప్రైవేట్ జెట్ బాల్టిక్ సముద్రంలో స్వీడిష్ గగనతలం మీదుగా ప్రయాణించి, రాత్రి 8:00 గంటల ముందు (1800 GMT) వెంట్స్పిల్స్ సముద్రంలో కూలిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఘటనా స్థలంలో చనిపోయిన వ్యక్తులు ఎవ్వరూ కనిపించలేదు.

ప్రమాద సమయంలో నలుగురు విమానంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. వారి జాతీయత వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. దీంతో ఈ విమానాన్ని "ఘోస్ట్ ప్లేన్" గా అభివర్ణిస్తున్నారు. విమానం కూలిపోవడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ ప్రైవేట్ జెట్ "స్పెయిన్ మరియు కొలోన్ మధ్య ఎగురుతోంది, కానీ అది మార్గం మార్చినప్పుడు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సంప్రదించలేకపోయారని" అని లాట్వియన్ పౌర విమానయాన ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఆస్ట్రియన్-రిజిస్టర్డ్ విమానం లాట్వియన్ తీరానికి చేరుకునే వరకు సాపేక్షంగా స్థిరంగానే ప్రయాణించిందని, అయితే అది ఉన్నట్టుంది హఠాత్తుగా ఎత్తును కోల్పోయి క్రిందకు పడిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. బహుశా, విమానంలో "ఇంధనం అయిపోవడం" వలన క్రాష్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి, ఇవన్నీ ఊహాగానాలు, అంచనాలు మాత్రమేనని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఏజెన్సీ తెలిపింది.

ప్రయాణీకులను గాలించేందుకు లాట్వియా, లిథువేనియా మరియు స్వీడన్ నుండి పడవలు మరియు హెలికాప్టర్లతో రెస్క్యూ బృందాలు క్రాష్ సైట్ వద్ద పని చేస్తున్నాయని లాట్వియన్ ఏవియేషన్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటి వరకూ మానవ అవశేషాలు ఏవీ కనుగొనబడలేదని మరియు విమానం రాడార్ నుండి తప్పిపోవడానికి కారణమేమిటో తెలియరాలేదని ఏజెన్సీ పేర్కొంది.

అసలు ఘోస్ట్ ప్లేన్స్ అంటే ఏమిటి?
దెయ్యపు విమానాలు (Ghost Planes) గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? దెయ్యపు విమానాలు లేదా ఘోస్ట్ ప్లేన్స్ అంటే, ఆ విమానాల్లో దెయ్యాలు ఉంటాయని కాదు. కేవలం పైలట్స్ లేదా పరిమిత సిబ్బందితో మాత్రమే ఖాలీగా ప్రయాణించే విమానాలను ఘోస్ట్ ప్లేన్ అంటారు.

కోవిడ్-19 సమయంలో ఇలాంటి ఘోస్ట్ ప్లేన్ చాలానే గాలిలో తిరిగాయి. కరోనా ప్రయాణ ఆంక్షల నేఫథ్యంలో, అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను చాలా వరకూ ఖాలీగా లేదా పది శాతం కన్నా తక్కువ ప్రయాణీకులతో నడిపాయి. సుమారు 200 నుండి 500 మందికి పైగా ప్రయాణించగల సామర్థ్యం గల విమానాలను ఎలాంటి ప్రయాణీకులు లేకుండా లేదా అదికొద్ది ప్రయాణీకులతో మాత్రమే గాలిలోకి ఎగిరిస్తుంటారు. అలాంటి ఫ్లైట్స్ నే ఘోస్ట్ ప్లేన్ అని పిలుస్తారు.

గతేడాది మనదేశంలో కూడా ఇలాంటి ఓ సంఘటన జరిగింది. ముంబై నుండి దుబాయ్ వెళ్తున్న 360 సీట్లు కలిగిన బోయింగ్ 777 విమానంలో కేవలం ఒకే ఒక్క ప్యాసింజర్ మాత్రమే ప్రయాణించాడు. అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. యూరప్లో కూడా ప్రతినెలా అనేక విమానాలు ఖాళీగా ప్రయాణిస్తుంటాయి. గడచిన రెండు మూడళ్లలో లాటిన్ అమెరికా లేదా కరీబియన్ ప్రాంతంలో ఇలాంటి ఘోస్ట్ ప్లేన్స్ చాలానే ప్రయాణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఏదైనా ఎయిర్లైన్స్ తమ విమానాన్ని ఒక నిర్ధిష్ట ఎయిర్పోర్టులో ఎక్కువ కాలం పార్క్ చేయాలంటే, సదరు విమానయాన సంస్థ ఎయిర్పోర్టుకి భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, వేరే గత్యంతరం లేక విమానయాన సంస్థలు తమ విమానాలను ఖాలీగా తిప్పుతుంటాయి. అలాగే, చాలా విమానాశ్రయాలు తమ టేకాఫ్, ల్యాండింగ్ స్లాట్లను మెయింటెయిన్ చేయాలంటే షెడ్యూల్ చేసిన విమానాల్లో సుమారు 80 శాతం విమానాలను తిప్పాల్సి ఉంటుంది. మిగిలిన 20 సాతం విమానాలకు క్యాన్సిల్ మార్జిన్ ఉంటుంది.

నిజానికి, ఇలాంటి ఘోస్ట్ ప్లేన్స్ వల్ల ఎవరికీ, ప్రత్యేకించి విమానయాన కంపెనీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏవియేషన్ నిపుణులు దీనిని ఒక అనవసరమైన చర్యగా పేర్కొంటారు. విమానాశ్రయాలు ఇలా చేయడానికి బదులుగా ఎయిర్ పోర్ట్ స్లాట్లను సమన్వయంతో పంపిణీ చేయడం ద్వారా వివిధ రకాల ఎయిర్లైన్స్ సంస్థ మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచవచ్చని, తద్వారా ప్రయాణికులకు మరియు విమానయాన సంస్థలకు లాభం చేకూర్చేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
NOTE: ఈ కథనంలో ఉపయోగించిన ఫోటోలు కేవలం అవగాహన కోసం మాత్రమే..


Click it and Unblock the Notifications








