సినిమాను తలపించిన ఆటో డ్రైవర్ స్పీడ్.. మెరుపు వేగంతో దూసుకెళ్తూ ట్రైన్ క్యాచ్, వీడియో వైరల్!!
ఓ ఆటో డ్రైవర్ రైలు కంటే వేగంగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మెరుపు వేగంతో దూసుకెళ్తూ ప్రయాణికుడు ఎక్కాల్సిన ట్రైన్ను క్యాచ్ చేశాడు. ఇందుకు పెద్ద మొత్తంలోనే ఛార్జీలు వసూలు చేశాడు ఆటో డ్రైవర్.. కానీ అతను చేసిన హెల్ప్కి ఆ మొత్తం చాలా తక్కువ అని మెచ్చుకున్నాడు ప్యాసింజర్.. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..
ఎప్పుడైనా మీరు ఎక్కాల్సిన ట్రైన్ను క్యాచ్ చేయాలంటే ఓ 30 నిమిషాల ముందే అక్కడ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మెట్రో పాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ గురించి తెలియనిది కాదు. ముఖ్యంగా బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి చాలా విపరీతంగా ఉంటుంది. చాలా మంది ఎక్కువ సమయాన్ని ట్రాఫిక్లోనే గడుపుతారంటే ఆశ్చర్యం లేదు.

కాగా ఇటీవల ఆదిల్ హుస్సేన్ అనే వ్యక్తి బెంగళూరు రైల్వే స్టేషన్లో ఎక్కాల్సిన ట్రైన్ను.. వివిధ కారణాల వల్ల మిస్ అయ్యాడు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ సాయంతో తాను మిస్ అయిన ట్రైన్ను క్యాచ్ చేశాడు. బెంగళూరు లాంటి ట్రాఫిక్ రద్దీ నగరంలో ఇదెలా సాధ్యం..
ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆదిల్ హుస్సేన్ తన X(ట్విట్టర్) పేజీలో షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన బెంగళూరు వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి నగరంలో ఇదెలా సాధ్యమంటూ ఆశ్చర్యపోయారు. బెంగళూరు నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్కు ఆదిల్ హుస్సేన్ టికెట్ బుక్ చేసుకున్నాడు.

ఈ క్రమంలో బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1:40 గంటలకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ బయలుదేరాల్సి ఉంది. సరిగ్గా షెడ్యూల్ ప్రకారమే రైలు కూడా బయలుదేరింది. అయితే ఈ రైలులో టికెట్ బుక్ చేసుకున్న ఆదిల్ హుస్సేన్ సమయానికి స్టేషన్కు చేరుకోకపోవడంతో ట్రైన్ మిస్ అయింది. ఆఫీసు పని, ట్రాఫిక్ కారణంగా అతను రైలు మిస్సయినట్లు తెలిపాడు.
రైల్వే స్టేషన్లోకి ప్రవేశించగానే, రైలు అప్పటికే బయలుదేరినట్లు ప్రకటన రావడంతో.. ఏం చేయాలో తోచని స్థితిలో ఉండగా.. ఆటో డ్రైవర్ అతని పరిస్థితి అర్థం చేసుకున్నాడు. రైలును క్యాచ్ చేయడానికి సహాయం చేస్తానని.. తదుపరి స్టాప్ ఎలహంగ రైల్వే స్టేషన్లో ఆగుతుందని చెప్పాడు. రైలు రాకముందే స్టేషన్కు చేరుస్తానని తెలిపాడు.
కానీ ఆదిల్ హుస్సేన్ ఆటో డ్రైవర్ మాటలు నమ్మలేదు. మెజెస్టిక్ ప్రాంతం నుంచి ఎలహంగా ప్రాంతానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించాలి. కాగా అప్పటికే సమయం 1.50 అయింది. ఈ రైలు సరిగ్గా మధ్యాహ్నం 2:20 గంటలకు ఎలహంక రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. అయితే మెజెస్టిక్ నుంచి ఎలహంగాకి సరిగ్గా 30 నిమిషాల్లో చేరుస్తానంటే ఆదిల్ నమ్మలేదు.
బెంగళూరు నగరంలో భారీ ట్రాఫిక్తో 17 కి.మీలను 30 నిమిషాల్లో పూర్తి చేయడం అసాధ్యమైన పని తెలిసి.. తనను మోసం చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడని భావించాడు. అయితే ఆటో డ్రైవర్ ఆదిల్కు హామీ ఇచ్చాడు. ఛార్జీ రూ. 2500 ఇస్తే రైలును క్యాచ్ తప్పకుండా క్యాచ్ చేస్తానని.. అలా పట్టుకోగలిగితేనే రూ. 2500 ఇవ్వాలని చెప్పాడు.
ఆలోచనలో పడ్డ ఆదిల్.. సిటీకి వెళ్లాలంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలని, దాని ధర చాలా ఎక్కువగా ఉంటుందని భావించాడు. ఇప్పటికే బుక్ చేసిన రైలు టికెట్ వృథా అవుతుందని.. ఆటో డ్రైవర్ డీల్కు ఆదిల్ హుస్సేన్ ఒప్పుకున్నాడు. దీంతో ఆటో డ్రైవర్ ప్రయాణికుడిని ఎక్కించుకుని ఎలహంక వైపు వేగంగా ప్రయాణం కొనసాగించాడు. ఆటో డ్రైవర్ తనకు తెలిసిన కూడళ్ల గుండా ఆటోను వేగంగా నడిపాడు.
చాలా వేగంగా ప్రయాణిస్తూ, సరిగ్గా 2:15కి ఎలహంక రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. దీంతో వెంటనే ఆటో డ్రైవర్కి రూ.2500 చెల్లించి మరో 5 నిమిషాల్లో ప్లాట్ఫారమ్పైకి వెళ్లి మిస్సయిన రైలును క్యాచ్ చేశాడు. ఈ సంఘటనను ఆదిల్ హుస్సేన్ తన X పేజీలో షేర్ చేశారు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైలును మిస్సవకుండా హెల్ప్ చేసిన ఆటో డ్రైవర్పై నెటిజన్లు పలువురు ప్రశంసలు కురిపించారు. ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే కొందరు ఆటో డ్రైవర్కు రూ. 2500 ఛార్జెస్ ఇవ్వడం ఎక్కువ అని కొందరు కామెంట్ చేయగా.. విమానంలో ప్రయాణించి ఉంటే మూడు రెట్లు ఎక్కువ చెల్లించేవాడినని ఆదిల్ హుస్సేన్ రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా రైలు టికెట్ కూడా వృథా అయి ఉండేదని తెలిపాడు.
రూ. 2500 ఇవ్వడం వల్ల చాలా వరకు ఖర్చులు తగ్గాయని ఆదిల్ హుస్సేన్ నెటిజన్లకు బదులిచ్చాడు. బెంగళూరు ఆటోడ్రైవర్ చేసిన ఈ చర్య పలువురి దృష్టిని ఆకర్షించింది. అయితే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇంత వేగంగా డ్రైవ్ చేయడం ప్రమాదకరం. కొన్ని సందర్భాల్లో ఇది ప్రయాణికులకు, ఇతరులకు మేలు చేసినా.. అతి వేగం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.


Click it and Unblock the Notifications








