డీజిల్ కార్ల ఉత్పత్తి ఆపాలి.. లేదంటే అదనపు పన్ను తప్పదు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా వేగంగా అడుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్లు సైతం ఈవీ రంగంలో అడుగుపెట్టాయి. డీజిల్ కారణంగా వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుండటంతో తాజగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
దేశంలో కార్ల తయారీ కంపెనీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కార్ల కంపెనీలు తమ ఉత్పత్తిని పరిమితం చేయకుంటే డీజిల్ వాహనాలపై పన్నును పెంచుతామని తెలిపారు. పన్ను పెంపుదలతో ఉత్పత్తి తర్వాత, వాటిని విక్రయించడం మరింత కష్టం అవుతుందని.. ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ప్రభుత్వానికి వేరే మార్గం లేదని ఆయన వెల్లడించారు.

ఢిల్లీలో జరిగిన సియామ్ 63వ వార్షిక సదస్సులో గడ్కరీ మాట్లాడారు. 'డీజిల్కు గుడ్బై చెప్పండి.. దయచేసి డీజిల్ ఆధారిత వాహనాలను తయారు చేయడం ఆపండి.. లేకుంటే డీజిల్ కార్లను విక్రయించడం కష్టమయ్యేలా పన్నును పెంచుతాం'' అని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే మారుతీ సుజుకీ, హోండా వంటి కార్ల తయారీ సంస్థలు డీజిల్ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేశాయి.
డీజిల్ను "ప్రమాదకరమైన ఇంధనం"గా పేర్కొన్న మంత్రి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా భారతదేశం ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉందని పేర్కొన్నారు. డీజిల్ కార్ల సంఖ్య 2014లో 53 శాతం ఉండగా ఇప్పుడు 18 శాతానికి పడిపోయిందని, ఇది శుభసూచకమని, అయితే ఇంకా తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా మంత్రి X(ట్విట్టర్)లోనూ దీనిపై పోస్ట్ చేశారు. '2070 నాటికి, కర్బన ఉద్గారాలను వీలైనంత తగ్గించడం ద్వారా డీజిల్ వంటి ప్రమాదకర ఇంధనాల వల్ల కలిగే వాయు కాలుష్య స్థాయిని తగ్గించడం లక్ష్యం. వాహన విక్రయాల్లో వేగవంతమైన వృద్ధికి అనుగుణంగా, స్వచ్ఛమైన మరియు పర్యావరణ హిత ఇంధనాలను ప్రోత్సహించడం అత్యవసరం. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, కాలుష్య రహితంగా ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు.
పన్ను పెంపుపై ఇప్పటికే ప్రచారంలో ఉన్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. అదనపు పన్ను పెంపుదల 10 శాతం వరకు ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. కాగా అటువంటి పెంపుదల నిర్ణయంపై నిర్దిష్ట ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు.
కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి క్లీన్ ఫ్యూయల్ వాడాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్రస్తుతం అన్ని రకాల వాహనాలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది కేంద్రం. వాహనాలను బట్టి 1-22 శాతం అదనపు సెస్ విధిస్తోంది. ఎస్యూవీ కార్లపై 28 జీఎస్టీతోపాటు 22 శాతం అదనపు సెస్ వసూలు చేస్తోంది.
ఇథనాల్ మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణ అనుకూల ఇంధనాలపై దృష్టి పెట్టడానికి కార్ల తయారీదారులు తమ ఉత్పత్తిని తిరిగి మార్చాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలో వారిని కోరారు. దీని ద్వారా భారతీయ రోడ్లపై మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి వీలు కల్పిస్తుందన్నారు.
ఈవీల సమస్యలు, రేంజ్ ఆందోళన, అగ్ని ప్రమాదాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు విముఖత చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అయినా ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో EVలలో కనిపించే సమస్యలు దాదాపు తగ్గాయి. ఈవీలను కొనుగోలు చేసేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రజలను ప్రోత్సహిస్తూ సబ్సిడీలు ఇస్తోంది. అయితే మరి డీజిల్పై భవిష్యత్తులో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








