ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
భారత్లో త్వరలో బుల్లెట్ రైళ్లు(Bullet Trains) అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం చైనా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే బుల్లెట్ రైళ్లు నడుస్తుండగా.. ఈ దేశాల సరసన త్వరలో భారత్ కూడా చేరనుంది. ఈ క్రమంలో బుల్లెట్ రైలుకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి ఆసక్తికర వీడియోను షేర్ చేశారు.
భారత్లో తొలిసారిగా త్వరలో ముంబయి- అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. రూ. 1.08 లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. జపాన్ ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్ట్ 'బాలస్ట్లెస్ ట్రాక్'(Ballastless Track) వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పంచుకున్నారు.

గరిష్ఠంగా గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించేలా బుల్లెట్ రైలు(Mumbai-Ahmedabad Bullet Train) బాలస్ట్లెస్ ట్రాక్ నిర్మాణాన్ని చేపట్టారు. అధునాతన టెక్నాలజీ సాయంతో రైలుకు అవసరమైన స్లాబ్ను గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు. 295.5 కి.మీ ట్రాక్ ఫౌండేషన్ సీలింగ్ పనులు కూడా ఇప్పటికే పూర్తి కాగా.. 153 కి.మీ వయాడక్ట్ (బ్రిడ్జి) నిర్మాణం పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది.
బుల్లెట్ రైలు(Bullet Train In India) నిర్మాణానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియోలో పథకం గురించి పూర్తిగా వివరించారు. గరిష్ఠ వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు రెండు నగరాల మధ్య 508 కి.మీ దూరాన్ని కేవలం 2 గంటల్లో చేరుకుంటుందని వీడియోలో వివరించారు. ప్రస్తుతం ముంబయి నుంచి అహ్మదాబాద్కు రైలులో వెళ్లేందుకు 5.30 గంటల నుంచి 9 గంటల సమయం పడుతోంది.

గరిష్ఠంగా గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఇంజిన్ను రూపొందించారు. వినూత్న టెక్నాలజీని ఉపయోగించి.. ముంబయి మరియు అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం దేశంలోనే మొదటిసారిగా స్లాబ్ ట్రాక్ సిస్టమ్ని వినియోగించడంతో పాటు.. ఎర్లీ ఎర్త్క్వేక్ డిటెక్షన్ సిస్టమ్ను కూడా ఈ ప్రాజెక్టులో ఉపయోగించారు.
24 నదీ వంతెనలు, 28 ఉక్కు వంతెనలు, 7 పర్వత సొరంగాలు, 7 కి.మీ పొడవైన సముద్రగర్భ సొరంగాలు మరియు 12 రైల్వే స్టేషన్ల మీదుగా ముంబయి- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నడుస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నవంబర్ 2021 లోనే ప్రారంభం కాగా. శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి.

బుల్లెట్ రైలు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత.. రైల్వే శాఖ ప్రతిరోజూ 70 ట్రిప్పులతో 35 రైళ్లను నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.2050 నాటికి ఈ హైస్పీడ్ రైళ్ల సంఖ్యను 105కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. బుల్లెట్ రైలులో ప్రతి ఏటా దాదాపు సుమారు 1.6 కోట్ల మంది ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు అనంతరం భారతదేశంలోని వివిధ మార్గాల్లో బుల్లెట్ రైళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. నేషనల్ రైల్ ప్లాన్లో భాగంగా ముంబయి-హైదరాబాద్ రూట్తో పాటు ఢిల్లీ- వారణాసి, ఢిల్లీ- అహ్మదాబాద్, ముంబయి- నాగ్పూర్, చెన్నై- మైసూర్, వారణాసి- హౌరా రూట్లలో బుల్లెట్ రైళ్లను నడపనున్నట్లు గతంలో కేంద్ర మంత్రి వెల్లడించారు.

2041 నాటికి హైదరాబాద్-బెంగళూర్ రూట్లో 618 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ బుల్లెట్ రైలు అందుబాటులోకి రానున్నట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ముంబయి- హైదరాబాద్ రూట్లో బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ 2051 నాటికి పూర్తి కావచ్చని తెలుస్తోంది. ఈ రెండు రూట్ల మధ్య 709 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైల్వే ప్రాజెక్ట్ కవర్ చేయనుంది.


Click it and Unblock the Notifications








