బెంగళూరు ఆటో డ్రైవర్ ఘరానా మోసం.. వీడియో ఎడిటింగ్ చేస్తే గానీ తెలియలేదు.. ఖంగు తిన్న బాధితుడు
కొంతమంది ఆటో డ్రైవర్లు సిటీకి కొత్తగా వచ్చినవారి దగ్గర, రూట్ తెలియనివారి దగ్గర కాస్త దూరానికే వందల రూపాయలు ఛార్జ్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఇప్పుడంటే ఓలా, ఉబర్ ఆటోలు రావడంతో యాప్లో ఎంత చూపిస్తే అంత ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం. అయితే గతంలో తెలియని వారి దగ్గర దోపిడీ కాస్త ఎక్కువగానే ఉండేది.
ఈ నేపథ్యంలో ఆటోలో ప్రయాణించాల్సి వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలని తాజాగా బెంగళూరులో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే అర్థమవుతుంది. బాధితుడు ఈ సంఘటనను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. మరోసారి ఎవరైనా సరే ఈ ఆటోను ఎక్కవద్దంటూ వీడియోలో పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే..

కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వం శక్తి యోజన పథకం ప్రవేశపెట్టిన తర్వాత బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సులు రద్దీగా మారి.. ప్రైవేట్ బస్సులు, ఆటో డ్రైవర్లపై పెను ప్రభావం చూపిందని ప్రతిపక్షాలతోపాటు పలువురు అభిప్రాయపడ్డారు.
దీంతో శక్తి యోజనతో తాము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు తమ కష్టాలను చెప్పుకున్నారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఇప్పటికే ఆటో డ్రైవర్ల సంఖ్య విపరీతంగా ఉంది. ఈ క్రమంలో బెంగుళూరులో కొందరు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. నగరానికి కొత్తగా వచ్చిన వారి నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడం చూస్తూనే ఉన్నాం.

బంగ్లాదేశ్కు చెందిన ఎండీ ఫిజ్ అనే వ్యక్తి ఫిజ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవలే అతను బెంగుళూరు ప్యాలెస్ను సందర్శించేందుకు నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో బెంగళూరులో ఓ ఆటో ఎక్కి తాను దిగాల్సిన ప్లేస్ వచ్చిన తర్వాత ఆ ఆటో డ్రైవర్కు రూ.500 ఇచ్చాడు. అయితే ఆ ఆటో డ్రైవర్ ఇక్కడే తన తెలివిని ప్రదర్శించి యూట్యూబర్ను బోల్తా కొట్టించాడు.
ఆ ఆటో డ్రైవర్.. విదేశీ బ్లాగర్తో 'మీరు వంద రూపాయలే ఇచ్చారు. కానీ మీ ఛార్జ్ రూ.300 అయ్యింది. మీరు మరో రూ.200 ఇవ్వాల'ని చెప్పాడు. దీంతో ఫిజ్ తాను నిజంగానే తక్కువ ఇచ్చానేమోనని భావించి ఆటో డ్రైవర్ నుంచి రూ.100 తీసుకొని రూ.500 ఇచ్చాడు.

అనంతరం రూ. మూడు వందలు తీసుకుని ఆ ఆటో డ్రైవర్ చిల్లర ఇవ్వబోతుండగా ఉంచుకో అని చెప్పి ఫిజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ సమయంలో ఆటో డ్రైవర్ చేసిన మోసం ఫిజ్ అప్పుడు గుర్తించలేకపోయాడు. కానీ అప్పటికే ఫిజ్ తాను తీస్తున్న వీడియోలో ఆటో డ్రైవర్ చేసిన మోసం అంతా స్పష్టంగా రికార్డు అయింది.
ఇంటికి వెళ్లిన అనంతరం ఫిజ్ తన రైడ్ను యూట్యూబ్లో అప్లోడ్ చేసే క్రమంలో ఆటో డ్రైవర్ చేసిన మోసాన్ని గుర్తించాడు. దీంతో ఒక్కసారిగా ఖంగు తిని తాను మోసపోయినట్లు గుర్తించాడు. అనంతరం ఆ వీడియోను పోస్ట్ చేస్తూ బెంగళూరులో ఈ డ్రైవర్ ఆటోను ఎక్కవొద్దు అంటూ చెప్పుకొచ్చాడు ఆ వీడియోలో. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ ఎలా మోసం చేశాడంటే..

ఆ వీడియోలో రికార్డయిన సంఘటనను పరిశీలిస్తే.. ముందు ఆటో డ్రైవర్కు ఫిజ్ రూ.500 ఇచ్చారు. అయితే క్షణాల్లోనే ఆటో డ్రైవర్ తన షర్ట్ చేతి మడతల్లో ఆ రూ. 500 నోటు దాచేసి అప్పటికే చేతిలో రెడీగా పెట్టుకున్న రూ.100 నోటు చూపించి మరో రూ.200 ఇవ్వాలని అడిగాడు. దీంతో ఫిజ్ ఆ 100 రూపాయలు తీసుకుని రూ. 500 ఇచ్చాడు. చిల్లర ఇస్తుండగా ఉంచుకోమని చెప్పాడు.
అయితే ఇక్కడ ఫిజ్ తన రైడ్ మొత్తాన్ని వీడియో తీస్తున్న విషయం తెలిసి కూడా ఆ ఆటో డ్రైవర్ అతడిని మోసం చేశాడు. ఫిజ్ ఈ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేయడంతో వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా బెంగళూరులో ఆటోలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








