ఈ వ్యక్తి మాములోడు కాదు.. ఎలక్ట్రిక్ ఆటోరిక్షాతో ఏకంగా అత్యంత ప్రమాదకరమైన ఖర్దుంగ్లా పాస్ దాటేశాడు..
ప్రస్తుతం, మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం చిన్నపాటి దూర ప్రయాణాలను ఉద్దేశించినవి మాత్రమే. ఎందుకంటే, మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి సరిపడా చార్జింగ్ మౌళిక సదుపాయాలు అందుబాటులో లేవు. అలాగని, ఎలక్ట్రిక్ వాహనాలతో దూర ప్రయాణాలు చేయడం కష్టమని కూడా కాదు. సరైన ప్రణాళిక ఉంటే, ఎలక్ట్రిక్ వాహనాలతో ఎంత దూరమైనా సులువుగా చేరుకోవచ్చని నిరూపించాడు బెంగుళూరుకు చెందిన ఓ యూట్యూబర్. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

బెంగుళూరుకు చెందిన ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ మరియు ఫిట్నెస్ ట్రైనర్ జోతి విక్నేష్ ఇటీవలే మహీంద్రా ట్రియో (Mhindra Treo) ఎలక్ట్రిక్ ఆటోరిక్షాతో ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటైన మరియు దేశంలో కెల్లా ఎత్తైన రహదారి అయిన ఖర్దుంగ్ లా పాస్ చేరుకున్నాడు. మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇతను ముద్దుగా హోప్ (Hope) అని పిలుచుకుంటాడు. ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో అతను తన సాహస యాత్ర ప్రారభించాడు. ఈ సాహస యాత్రకు సంబంధించిన వీడియోని అతన తన యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేశాడు.

మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో విక్నేష్ చేసిన తాజా ఫీట్ని మరోసారి మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అనంద్ మహీంద్రా గత కొంత కాలంగా విక్నేష్ ప్రయాణాన్ని ఫాలో చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఖర్దుంగ్లా పాస్ను చేరుకున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆటోరిక్షాగా విక్నేష్ నడిపిన మహీంద్రా ట్రియో రికార్డు నెలకొల్పింది. మరి విక్నేష్ తన సాహస యాత్రను ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాతో ఎలా సాధించాడనే కదా మీ సందేహం. రండి అదెలానో చూద్దాం.

ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో సుదీర్ఘ ప్రయాణం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను బద్దలు కొట్టే ప్రయత్నంలో భాగంగా, విక్నేష్ డిసెంబర్ 5, 2021వ తేదీన బెంగుళూరు నుండి తన హోప్ (మహీంద్రా ట్రియో) లో ప్రయాణాన్ని ప్రారంభించాడు. హోప్ (ఎలక్ట్రిక్ ట్రియో) లో తన ప్రయాణాన్ని విక్నేష్ తన యూట్యూబ్ ఛానెల్ అయిన ఇండియా ఆన్ 3 వీల్స్లో అలాగే అతని ఇతర సామాజిక ఛానెల్లలో డాక్యుమెంట్ చేస్తూ అనేక రాష్ట్రాలను కవర్ చేయడం మరియు దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు చేరుకోవడాన్ని పోస్ట్ చేశాడు.

విక్నేష్ ఇలా 8 నెలల పాటు ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో అతన ఇప్పటికే 17,000 కిలోమీటర్లు మరియు 20 రాష్ట్రాలను అధిగమించాడు. విక్నేష్ తన రికార్డు స్థాయి పర్యటనలో కాలుష్య రహిత భారత్ అనే సందేశాన్ని కూడా ప్రచారం చేస్తూ వచ్చాడు. జోతి విక్నేష్ ఇటీవల తన హోప్ తో సముద్ర మట్టానికి 17,852 అడుగుల (5,359 మీటర్ల) ఎత్తులో ఉన్న ఖర్దుంగ్ లా పాస్ చేరుకున్నాడు.

అతను తన గిన్నిస్ రికార్డు సాధించడానికి 20,000 కిలోమీటర్ల మార్కును దాటవలసి ఉండగా, విక్నేష్ తన మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ఓడోమీటర్తో దేశవ్యాప్తంగా తన ప్రయాణాన్ని 30,000 కిలోమీటర్లకు పైగా ముగించాలని యోచిస్తున్నాడు. విక్నేష్ ఖర్దుంగ్ లా పాస్ పైకి చేరుకోవడం మరియు తన హోప్ తో దేశవ్యాప్తంగా అతని ప్రయాణంలో రికార్డులను సృష్టించడం ఇదేం మొదటిసారి కాదు.

గడచిన మేలో విక్నేష్ తన ట్రియో హోప్ తో బుమ్లా పాస్ ను చేరుకున్నాడు. ఆ సమయంలో ఇది సముద్ర మట్టానికి 15,200 అడుగుల (4,600 మీటర్లు) ఎత్తులో ఉన్న పాస్ను చేరుకున్న మొదటి ఎలక్ట్రిక్ ఆటోరిక్షాగా మహీంద్రా ట్రియో నిలిచింది. విక్నేష్ ఉపయోగించిన మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా లో 7.37kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. మహీంద్రా క్లెయిమ్ చేసిన దాని ప్రకారం ఇది పూర్తి చార్జ్ పై 141 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోరిక్షాని ఇళ్లలో ఉండే సాధారణ 16A త్రీ-పిన్ సాకెట్లో ఉంచి చార్జ్ చేసుకోవచ్చు. ఈ హోమ్ ప్లగ్ ద్వారా దాని బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా చార్జ్ చేయడానికి 3 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది. విక్నేష్ తన ప్రయాణంలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా చార్జింగ్ ముగిసే సమయానికి ఏదో పెట్రోల్ బంక్ లేదా పబ్లిక్ చార్జింగ్ పాయింట్ ఉండే ప్రాంతానికి చేరుకొని చార్జ్ చేసుకొని, తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించేవాడు. ఇలా అతను ఖర్దుంగ్లా పాస్ చేరుకోవడానికి 8 నెలల సమయం పట్టింది.

మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది వెనుక చక్రాలను నడుపుతుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 10.72bhp (8kW) శక్తిని మరియు 42Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ జీరో ఎమిషన్ ఆటోరిక్షా గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. మహీంద్రా ట్రియో 12.7 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంటుంది. కాబట్టి, ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా వాలుగా ఉండే రోడ్లను కూడా సులువుగా అధిగమిస్తుంది. అందుకే, ఇది అత్యంత ఎత్తైన ఖర్దుంగ్లా పాస్ ని చేరుకోగలిగింది.


Click it and Unblock the Notifications








