బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు వస్తున్న వేలాడే బస్సులు (Sky Bus); నితిన్ గడ్కరీ ప్రకటన!
భారతదేశపు ఐటి రాజధాని బెంగుళూరును ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య "వాహనాల రద్దీ" (Traffic Jam). బెంగుళూరు నగరంలో ఐటి కంపెనీలు నానాటికీ పెరిగిపోవడంతో, కొత్త కంపెనీలకు చోటు కల్పించేందుకు నగరం కూడా శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో బెంగుళూరులో ఎక్కడ చూసినా ఏదో ఒక నిర్మాణ పనులు జరుగుతూనే కనిపిస్తాయి. పెరగుతున్న ట్రాఫిక్ను తగ్గించేందుకు ఫ్లైఓవర్లు మరియు మెట్రో విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి.

వాహనాల రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ సమస్య ఇంకా అధికమవుతూనే ఉంది. ప్రజల తలసరి ఆదాయం పెరగడంతో చాలా మంది వాహనాలను కొనుగోలు చేసి, ప్రజారవాణాకు బదులుగా వ్యక్తిగత రవాణాను ఎంచుకుంటున్నారు. ఫలితంగా, వాహనాల రద్దీ కూడా భారీగా పెరిగిపోతోంది. మరోవైపు కోవిడ్-19 తర్వాత కార్యలయాలు పూర్తిస్థాయిలో తెరచుకోవడంతో ఉద్యోగులు ఇప్పడు తప్పనిసరిగా ఇళ్లను వదలి ఆఫీసులకు రావల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతో బెంగుళూరులో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది.

ఇటీవల బెంగుళూరులో వచ్చిన వరదలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. ఎలక్ట్రానిక్ సిటీ, సిల్క్ బోర్డ్ వంటి ప్రాంతాలలో నిత్యం పరుగులు తీసే ఐటి ఉద్యోగులతో వాహన రద్దీ ఎక్కువగా ఉంటుంది. దూరప్రాంతాలలో నివసించే ఉద్యోగులు తమ ఆఫీసులను చేరుకోవడానికి రోజుకు సుమారు సగటున 2 నుండి 5 గంటల పాటు రోడ్డుపైనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. వాహన రద్దీని తగ్గించేందుకు మెట్రోతో పాటు సిటీ బస్సులు ఉన్నప్పటికీ, కోవిడ్-19 తర్వాత ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా వాహన రద్దీ పెరగడానికి మరో కారణంగా చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో, బెంగుళూరులో విపరీతంగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు వేలాడే బస్సు (Sky Bus)లను తీసుకురావడం ఒక్కటే మార్గమని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ స్కై బస్సులు సాధారణ మెట్రో రైళ్ల మాదిరిగా ట్రాక్ పైన కాకుండా, ట్రాక్ క్రింది భాగంలో వేలాడుతూ ప్రయాణిస్తుంటాయి. బెంగళూరులో స్కై బస్ రైలును తీసుకురావడానికి అధ్యయనం జరుగుతోందని నితిన్ గడ్కరీ తెలిపారు.

అంతేకాకుండా, తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఏర్పాటు చేసినట్లుగా వివిధ అంతస్తులుగా ఉండే రహదారులను బెంగుళూరు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు గుడ్బై చెప్పవచ్చని ఆయన అభిప్రాయం పడ్డారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) బెంగుళూరు నగరం గుండా వెళ్లే జాతీయ రహదారి (NH)లో రెండు లేయర్లతో కూడిన మూడు పొరల ఫ్లైఓవర్ను నిర్మిస్తుందని నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇందులో రోడ్డు మార్గం మరియు దాని పైన ఒక మెట్రో లైన్ ఉంటాయని వివరించారు.

బెంగుళూరు ట్రాఫిక్ సమస్య గురించి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. "బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. శాటిలైట్ టౌన్షిప్ రింగ్ రోడ్ (STRR) విషయంలో మనం చేస్తున్నట్లుగా నగరం వెలుపల గ్రీన్ఫీల్డ్ హైవేలను నిర్మించగలిగినప్పటికీ, ఇప్పటికే ఉన్న రోడ్లను విస్తరించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. అందుకే నగరంలోని జాతీయ రహదారిపై మూడంచెల ఫ్లైఓవర్ నిర్మించాలని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి ప్రతిపాదించాను. ఇది ఇప్పటికే ఉన్న రహదారిపై రెండు రోడ్వే ఫ్లైఓవర్లను కలిగి ఉంటుంది మరియు దాని మీదుగా ఓ మెట్రో లైన్ ఉంటుంది" అని చెప్పారు.

ఇలాంటి హైవే ప్రాజెక్టులు ఇప్పటికే చెన్నై, పూణే మరియు నాగ్పూర్లలో ఇటువంటి ప్రాజెక్టులు జరుగుతున్నాయని, బెంగుళూరులో స్కైబస్ తరహా మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ యొక్క సంభావ్యతపై సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఓ అంతర్జాతీయ సలహాదారుని నియమించామని గడ్కరీ తెలిపారు. ఈ కొత్త మౌలిక సదుపాయాలు కొంతమేరకు రద్దీకి తోడ్పడే అవకాశం ఉన్నప్పటికీ, బెంగళూరు నగరానికి చాలా బలమైన ప్రజా రవాణా వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

బెంగళూరు నగరం కేవలం ట్రాఫిక్ రద్దీ సమస్యతో మాత్రమే కాకుండా, వాయు కాలుష్యం సమస్యను కూడా ఎదుర్కుంటోందని, రాబోయే ఐదేళ్లలో దేశంలోని పబ్లిక్ బస్ ఫ్లీట్ను 1.5 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని మరియు ఈ మొత్తం ఫ్లీట్ ను ఎలక్ట్రిక్ లేదా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచేలా చేయాలని యోచిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. నగరంలో బస్సు సర్వీసులను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, తాము ముంబైలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న ట్రాలీ బస్సులను బెంగుళూరులో కూడా ప్రవేశపెట్టమని తమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందిగా తాను బెంగళూరువాసులను కోరుతున్నానని అన్నారు.

ముంబైలో ప్రారంభించిన ట్రాలీ బస్సులు 88 సీట్ల కెపాసిటీని కలిగి ఉండి, పూర్తి ఎలక్ట్రిక్ బస్సుల కంటే కూడా పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయి. బెంగుళూరు నగరంలో ఉన్న మెట్రో యొక్క ప్రస్తుత మౌలిక సదుపాయాలను ఉపయోగించి స్కై బస్సులను నిర్మించే సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. అంటే, ఈ మెట్రో ట్రాక్ల పైన మెట్రో రైళ్లు, క్రింది భాగంలో వేలాడే స్కై బస్సులు ఉంటాయన్నమాట. మనదేశంలో, స్కై బస్సులు ఇంకా ఎక్కడా అధికారికంగా ప్రారంభం కాలేదు. కానీ, అనేక దేశాలలో ఇదొక విజయవంతమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థగా ఉంది.


Click it and Unblock the Notifications








