MotoGP Bharat లో భారత్ నుంచి పాల్గొంటున్న ఏకైక రైడర్ ఇతనే..
దేశంలో మొట్టమొదటిసారిగా MotoGP రేసింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం(సెప్టెంబర్ 22) ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో నిన్న ప్రాక్టీస్ రేసులు జరగగా.. ఈ రోజు క్వాలిఫయర్ రేసులు జరుగుతున్నాయి. అయితే ఈ రేస్లో భారత్ నుంచి ఒకే ఒక్క బైక్ రైడర్ పాల్గొన్నాడు.
MotoGP గ్రాండ్ ప్రిక్స్ భారతదేశం అంతటా మోటార్సైకిల్ రేసింగ్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సుమారు 74 ఏళ్ల చరిత్రతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మోటార్ సైకిల్ రేస్ ఇప్పుడు తొలిసారిగా భారత్లోనే నిర్వహిస్తుండటం విశేషం. సెప్టెంబర్ 24 వరకు రేసులు జరగనున్నాయి. రేపు ఫైనల్ రేసు జరగనుంది.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బైక్ రైడర్లు ఈ రేసుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఈ పోటీలను తిలకించేందుకు లక్షలాది మంది రేస్ ఫ్యాన్స్, సాధారణ ప్రజలు వస్తున్నారు. అయితే MotoGP Bharat రేసుల్లో ప్రపంచ ప్రఖ్యాత రైడర్లతో పాటు భారత్కు చెందిన యువ బైక్ రైడర్ కూడా పాల్గొంటున్నారు. నిజానికి, భారత్ నుంచి పాల్గొంటున్న ఏకైక రైడర్ ఇతనే.
ఈ రైడర్ పేరు కడై యాసీన్ అహమ్మద్(Kadai Yaseen Ahmed). 1997లో చెన్నైలో జన్మించిన యాసీన్ తొలిసారిగా మోటోజీపీలో పాల్గొంటున్నారు. చాలా మంది యువకుల మాదిరిగానే, యాసీన్ అహ్మద్ కూడా చిన్నతనం నుంచే బైక్ రేసింగ్ పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. పబ్లిక్ రోడ్లపై బైక్ రేసింగ్లు నిర్వహించడం నేరమని తెలియక 15 ఏళ్ల వయసులో అక్రమంగా రోడ్ రేసింగ్లకు పాల్పడ్డాడు.

అప్పుడు ఒక ప్రొఫెషనల్ రేసర్ యాసిన్ అహ్మద్ ప్రతిభను చూసి, అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని సలహా ఇచ్చాడు. ఇంకా అప్పటినుంచి యాసిన్కి ప్రొఫెషనల్ బైక్ రైడర్గా శిక్షణ ఇచ్చాడు. రైడింగ్లో బాగా శిక్షణ తీసుకున్న అహ్మద్.. ఇప్పటివరకు చెన్నై రేసింగ్ ట్రాక్లో నిర్వహించిన వివిధ రేసుల్లో పాల్గొన్నాడు.
సాధారణంగా యువకులు బైక్ రేసింగ్ నేర్చుకుంటామని ఆశపడితే.. తల్లిదండ్రులు వద్దని చెప్పడం సాధారణమే. యాసీన్ అహ్మద్ కూడా తొలిదశలో తల్లిదండ్రుల నుంచి ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. అతని తల్లి, ముఖ్యంగా, బైక్ రేసింగ్లో కొడుగు భద్రత గురించి చాలా ఆందోళన చెందింది. తరువాత, యాసీన్ అహ్మద్ ట్రైనర్, అతని కుటుంబానికి భరోసా ఇవ్వడంతో వారు అంగీకరించారు. దీంతో యాసిన్ ప్రొఫెషనల్ బైక్ రైడర్గా శిక్షణ పొందాడు.

MotoGP ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ, మన దేశంలో దీనిపై చాలా మందికి అవగాహన లేదని యాసీన్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. అయితే మోటోజీపీ ఈసారి భారత్లో నిర్వహిస్తుండటంతో ఇది దేశంలోని మరికొంత మంది రైడర్లను సృష్టిస్తుందని యాసీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తను ప్రస్తుతం MotoGP 3పై దృష్టి సారించారని.. భవిష్యత్తులో ముఖ్యమైన రేసుల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు యాసీన్ పేర్కొన్నారు.
కడై యాసీన్ అహ్మద్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన MotoGP వరకు తన ప్రస్థానం ఇలా సాగింది. భారతదేశంలో కొత్త రైడర్లను అభివృద్ధి చేయడంలో ఎంత పురోగతి సాధించారో అహ్మద్ సాక్షి. యాసీన్ను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో బైక్ రేసింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలో అడుగు పెట్టి విజయాలను సాధించాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








