నడిరోడ్డుపై దొంగల చేతివాటం.. అపాచీ బైక్పై వెళ్తూ స్కూటరిస్ట్ నుంచి సెల్ఫోన్ చోరీ, డ్యాష్క్యామ్లో వీడియో
దొంగతనానికి సంబంధించిన పలు సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉంటున్నాయి. సీసీ కెమెరాల ద్వారా పలు చోరీ ఘటనలను గుర్తించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ మీరు చూసిన దొంగతనాలు ఒక ఎత్తైతే.. తాజాగా జరిగిన సంఘటన మరో ఎత్తు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొందరు బస్సు లేదా ట్రైన్లో వెళ్తున్నప్పుడో లేదంటే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడో.. తరచూ సెల్ఫోన్లు చోరీ కావడం చూస్తూనే ఉంటాం. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ద్వారా.. టెక్నాలజీ సాయంతో చోరీకి గురైన సెల్ఫోన్ను ఇట్టే గుర్తించి బాధితులకు అందజేస్తున్నారు. కానీ రోడ్డుపై డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఫోన్ కొట్టేయడం మీరెప్పుడైనా చూశారా.. ఇక్కడ అదే జరిగింది.

రోడ్డుపై వెళ్తున్న స్కూటరిస్టు వద్ద.. టీవీఎస్ అపాచీ బైక్పై వచ్చిన దొంగల గుంపు సెల్ఫోన్ను దొంగిలించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆ స్కూటర్ వెనకాల వస్తున్న వాహనం డ్యాష్క్యామ్లో రికార్డయ్యాయి. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కాగా ఈ సంఘటన రాత్రి సమయంలో జరగడంతో రికార్డయిన దృశ్యాల వీడియో క్లారిటీ తక్కువగా ఉంది. అయినప్పటికీ ఘటన ఎలా జరిగిందో మనకు అర్థమవుతుంది. వీడియోలో రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తుండటాన్ని చూడవచ్చు. రోడ్డుకు ఎడమ వైపు అపాచీ బైక్ వెళ్తోంది. రైడర్ లేన్లను మారుస్తున్నప్పుడు ఆ బైక్పై వెనుక కూర్చున్న వ్యక్తి సమీపంలో ఇతర వాహనాలను పరిశీలిస్తుంటాడు.

ఈ క్రమంలో బైక్ పక్కన వెళ్తున్న ఓ స్కూటరిస్టు చేతిలో సెల్ఫోన్ను దొంగలు గుర్తించారు. దీంతో ఆ ఫోన్ కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. వెనుక నుంచి వేరే ఇతర వాహనాలు దగ్గరగా రావడం లేదని గుర్తించి స్కూటరిస్టు వెళ్లే మార్గం వైపు లేన్ను మార్చాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న వాహనాలన్నీ మెల్లగా వెళ్తున్నాయి. కాగా స్కూటరిస్ట్.. స్కూటర్ నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు.
దీంతో అతను పక్కనే వస్తున్న అపాచీ బైక్ను గమనించలేదు. అపాచీ రైడర్ స్కూటరిస్టు వద్దకు రాగానే పివిలియన్ సీట్లో కూర్చున్న వ్యక్తి వెంటనే అతని వద్ద ఫోన్ లాక్కున్నాడు. దీంతో హఠాత్పరిణామానికి గురైన స్కూటరిస్టు ఒక్కసారి బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోయాడు.

ఇదంతా రెప్పపాటు సమయంలో జరిగిపోయింది. కానీ అదృష్టవశాత్తూ వెనుక వస్తున్న వాహనాలన్నీ స్పీడ్ లిమిట్స్ పాటించి రావడంతో స్కూటరిస్టును ఏ వాహనమూ ఢీకొనలేదు. వెంటేనే వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఈ తతంగమంతా డ్యాష్క్యామ్లో రికార్డు కావడంతో ఇది పక్కా ప్రణాళికతో దొంగలు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ సంఘటనలో స్కూటర్ రైడర్ తప్పు కూడా ఉంది. అతను టూ వీలర్ డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడుతున్నాడు. ఇది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాదు. సంఘటనలో అతను కింద పడినా అదృష్టవశాత్తు అతడిని ఏ వాహనమూ ఢీ కొట్టలేదు. ఇలాంటి చోరీ సంఘటనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో రైడర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇకపై రోడ్లపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

దేశంలో తరచూ దొంగతనాలు, వాహనాల చోరీలను అరికట్టేందుకు పోలీసులు రోడ్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్ఠంగా పెంచారు. అయినా రోజూ దోపిడీలు, దొంగతనాలు జరుగుతూనే చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పార్క్ చేసిన కార్లు, బైక్లు, ఇతర వాహనాలు చోరీ అవుతున్నాయి. అయితే కొన్ని చోట్ల దొంగలు పట్టుబడినా చాలా మంది తప్పించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications








