2026లో డీజిల్ కార్ల అమ్మకాలను ఆపేస్తారా? కొత్త BS7 రూల్స్ వల్ల కార్ మార్కెట్లో ఏం జరుగుతుంది?
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, వాయు కాలుష్య ప్రభావాలు రోజు రోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భారత్ కూడా తన వంతుగా చర్యలు తీసుకుంటోంది. భారతదేశంలో వాహనాల ద్వారా వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రభుత్వం భారత్ స్టేజ్ ఎమిషన్ నిబంధనలను (BS Norms) అనుసరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా BS6 నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో వాహనాల నుంచి తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలు విడుదల అవుతాయి. దీని వలన వాయు కాలుష్యం తగ్గడానికి దోహదపడుతుంది. BS6 ప్రకారం, వాహన తయారీదారులు, నిర్దిష్ట మోతాదుకు మించి వాయు కాలుష్యం విడుదల చేయని విధంగా తమ ఇంజిన్ టెక్నాలజీని మార్చాల్సి ఉంది. దీంతో వాహనాల డిజైన్, ఇంజిన్ పనితీరు, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇప్పుడు మార్కెట్లోకి విడుదల అవుతున్న అన్ని వాహనాలు కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నవే. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, BS7 నిబంధనలు అమలులోకి రాబోతున్నాయన్న వార్తలు పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇవి అమలులోకి వస్తే, ఇప్పటికే కఠినమైన BS6 ప్రమాణాలను మించి మరింత కఠినంగా కాలుష్యాన్ని నియంత్రించేలా తమ వాహనాల ఇంజిన్లను మర్చాల్సి ఉంటుంది.

ముఖ్యంగా డీజిల్ ఇంజిన్తో నడిచే ప్యాసింజర్ వాహనాల భవిష్యత్తు అనిశ్చితంగా మారే అవకాశం ఉంది. BS7 అమలుతో డీజిల్ వాహనాలపై మరింత కఠినమైన పరిమితులు విధించబడే అవకాశం ఉంది. తయారీదారులపై టెక్నాలజీ మార్పు పరంగా మరింత భారం పడవచ్చు. దీని ప్రభావంతో వాహనాల ధరలు కూడా మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. BS7 నియంత్రణ నిబంధనలు 2026 లేదా 2027లో అమల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాహనాల కాలుష్యం అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారింది. ప్రస్తుతం అమలులో ఉన్న BS6 నిబంధనలు వలన, వాహన తయారీదారులు నైట్రోజన్ ఆక్సైడ్ (NOx) వంటి హానికర గ్యాస్ల ఉద్గారాలను కిలోమీటరుకు 60 మిల్లీగ్రాములకు పరిమితం చేయాల్సి ఉంది. అయితే, త్వరలో అమలులోకి వచ్చే BS7 నిబంధనలతో ఈ పరిమితులను ఇంకా కఠినతరం కానున్నాయి.

కాలుష్యాన్ని మరింత తగ్గించడానికి, వాహన తయారీదారులు తమ వాహనాల్లో సెలెక్టివ్ ఉత్ప్రేరక తగ్గింపు, డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్లు, AdBlue డోసింగ్ యూనిట్లు వంటి పరికరాలను అమర్చాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లయితే మొదటగా డీజిల్ ఇంజిన్ ప్యాసింజర్ కార్లకు భారీ ఎదురుదెబ్బ తగులుతుందని తెలుస్తుంది. ప్రారంభ దశలో వాణిజ్య వాహనాలపై కాకుండా ప్రయాణికుల వాహనాలపై దృష్టి పెడతారని అంచనా.
అంటే, ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్లు, నిర్మాణ యంత్రాలు వంటివి మొదటి దశలో ఈ నిబంధనల పరిధిలోకి రాకపోవచ్చు. దీని వల్ల మార్కెట్లో డీజిల్ ఆధారిత వాణిజ్య వాహనాలు పెద్దగా ప్రభావితమయ్యే అవకాశముండదు. కానీ ప్యాసింజర్ కార్లకు ఇది కీలకమైన మలుపు కావొచ్చు. ఇప్పటికే పలు కార్ల తయారీదారులు కూడా డీజిల్ వేరియంట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ కొత్త నిబంధనలతో డీజిల్ నుండి ఎలక్ట్రిక్కి వాహనాల వైపు మల్లే అవకాశం ఉంది.

BS7 ఆధారిత పరికరాలను ఇన్స్టాల్ చేయడం వల్ల కారు ధర రూ.1.8 లక్షల నుండి రూ.2.5 లక్షల వరకు పెరగవచ్చు. ధర పెరిగిన కొద్ది కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది. బదులుగా డీజిల్ వాహనాల సేల్స్ తగ్గిపోతాయి. దేశీయంగా ఉన్నటువంటి తయారీదారులు తమ డీజిల్ ఆధారిత వాహనాలను లోకల్గా విక్రయాలను తగ్గిస్తూనే, అదే సమయంలో ఇతర దేశాలకు ఎగుమతులను కూడా తగ్గించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








