బడ్జెట్ 2024లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి కీలక ప్రకటన..!!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సుమారు రూ.48 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ 2024ను (Budget 2024) ప్రవేశపెట్టారు. కీలక రంగాలకు కేటాయింపులు చేశారు. రవాణా, జాతీయ రహదారుల శాఖకు రూ.2.78 లక్షల కోట్లు, రైల్వే శాఖకు రూ.6.2 కోట్లను కేటాయించారు. ఈ బడ్జెట్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది.
విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లపై బడ్జెట్లో ప్రకటన : ఈ బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాల రంగంపై కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని విస్తరించడంతో భారత్ చొరవ చూపుతుందని తెలిపారు. ప్రభుత్వం పరంగా ఈ రంగానికి వివిధ రకాల సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సహకారం అందిస్తామన్నారు.

ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీ : భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే అని బలంగా విశ్వసిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రంగం వృద్ధి చెందేందుకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీని అందిస్తోంది. అయితే ఈ రంగంలోని ప్రధాన సమస్య అయిన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపైన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు.
భారత్లో 2070 నాటికి జీవో ఎమిషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగం విస్తరణ సహా ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం పరంగా మరింత ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు. ప్రజారవాణాలోకి ఎలక్ట్రిక్ వాహనాలు, బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

2030 నాటికి స్పష్టమైన లక్ష్యాలతో భారత్ : 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల వాటాను వాణిజ్య వాహనాల్లో 70 శాతం, ప్రైవేటు కార్లలో 30 శాతం, బస్సుల్లో 40 శాతం, ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల్లో 80 శాతానికి విస్తరించే లక్ష్యంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
యువతకు శిక్షణ మరియు ఉపాధి కల్పన : ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కృషిచేస్తామని, యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించి తయారీ, ఇన్స్టలేషన్, నిర్వహణ విభాగంలో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలకు ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని వెల్లడించారు.

పన్ను తగ్గింపు ప్రకటనల జోలికెళ్లిన మంత్రి : దీంతోపాటు మరో కీలక ప్రకటన చేశారు. భవిష్యత్లో ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కీలక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రత్యామ్మాయ ఇంధన వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై GST తగ్గింపు ప్రకటనలను ఆశించినా.. ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగంలో ఎటువంటి ప్రకటన రాలేదు.
ఎన్నికల అనంతరం కీలక ప్రకటనలు ఉండే అవకాశం! : ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెట్టారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు మాత్రమే ఈ బడ్జెట్ అందుబాటులో ఉంటుంది. అనంతరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహన రంగంపై మరిన్ని వరాలు కురిపించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








