ఇక రోడ్ల మీద పెట్రోల్ కార్లు కనిపిస్తే వింతగా చూస్తారేమో..బ్యాటరీల ధరలు తగ్గించేలా నిర్మలమ్మ మాస్టర్ ప్లాన్
కేంద్ర బడ్జెట్ 2026-27 ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఒక సరికొత్త ఊపిరిని ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ బడ్జెట్లో సామాన్యుడికి ఈవీ కార్లను మరింత చౌకగా అందించడమే కాకుండా, భారతదేశాన్ని ప్రపంచ ఈవీ హబ్గా మార్చేందుకు బలమైన పునాదులు వేశారు. కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాకుండా, ముడి పదార్థాల లభ్యత కోసం ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లను ప్రకటించడం విశేషం.
భారతదేశంలో ఎలెక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి ప్రధాన అడ్డంకి వాటి భారీ ధర. సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీల ధర 30-40 శాతం ఎక్కువగా ఉండటానికి కారణం అందులో వాడే బ్యాటరీలే. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేసింది. లిథియం-అయాన్ సెల్స్ తయారీకి అవసరమైన యంత్రాలు, ముడి పదార్థాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) నుంచి మినహాయింపును మార్చి 2028 వరకు పొడిగించారు. దీనివల్ల కంపెనీలకు తయారీ ఖర్చు తగ్గి, ఆ లాభాన్ని వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది.

బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాల ప్రాసెసింగ్ కోసం వాడే పరికరాలపై దిగుమతి పన్నును ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ప్రస్తుతం ఒక ఈవీ కారు ధరలో దాదాపు 40 శాతం వాటా బ్యాటరీదే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ పన్ను మినహాయింపుల వల్ల బ్యాటరీ ప్యాక్ల ధర తగ్గి, కారు మొత్తం ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మినహాయింపులు దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల కంపెనీలు మన దేశంలోనే సొంతంగా బ్యాటరీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయి.
ముడి పదార్థాల కోసం చైనా వంటి దేశాలపై ఆధారపడకుండా ఉండటానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 'రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లను' ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ కారిడార్ల ద్వారా ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ , తయారీ అంతా ఒకే చోట జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో లభించే ఖనిజాలను బ్యాటరీ తయారీకి వాడుకోవడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దీనికోసం సుమారు రూ.7,280 కోట్లతో కూడిన ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఆధునిక కార్లంటేనే చిప్స్ (సెమీకండక్టర్లు). ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కోసం ప్రభుత్వం కేటాయింపులను రూ.22,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచింది. దీనివల్ల కార్ల తయారీలో ఆలస్యం తప్పుతుంది. అంతేకాకుండా, ప్రజారవాణాను మరింత గ్రీన్ గా మార్చడానికి తూర్పు భారతదేశంలోని రాష్ట్రాల కోసం 4,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. అయితే, పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లపై జీఎస్టీని తగ్గించాలని ఆశించిన వారికి మాత్రం కొంత నిరాశ ఎదురైంది.
మొత్తానికి బడ్జెట్ 2026, ఎలెక్ట్రిక్ వాహనాల రంగానికి ఒక కొత్త దిశను చూపింది. కేవలం వినియోగదారులకు నేరుగా సబ్సిడీలు ఇవ్వడం కంటే, తయారీ ఖర్చును తగ్గించేలా పన్నులు సవరించడం వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనం ఉంటుంది. టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే ఈ నిర్ణయాలను స్వాగతించాయి. రాబోయే పండుగ సీజన్ నాటికి ఈవీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఎలెక్ట్రిక్ కారు వైపు చూడటానికి ఇదే సరైన సమయం.


Click it and Unblock the Notifications