దేశంలోనే తొలి బుల్లెట్ రైలు స్టేషన్ అదిరిపోయిందిగా.. ఈ గ్లింప్స్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.!!
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్కు సంబంధించిన వీడియోను తన X(ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించేలా అత్యాధునిక హంగులతో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతోంది.
అహ్మదాబాద్ సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్లో నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్(Mumbai- Ahmedabad Bullet Train Project) గ్లింప్స్ను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోను చూసినట్లయితే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న అనుభూతి ఎవరికైనా తప్పకుండా కలుగుతుంది. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్కు సంబంధించిన విజువల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

దేశంలో రెండు ఆర్థిక నగరాలు అహ్మదాబాద్, ముంబయిని కలుపుతూ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్ నుంచి ముంబయికి తొలి బుల్లెట్ ట్రైన్ త్వరలో పరుగులు పెట్టనుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక హంగులతో స్టేషన్ నిర్మాణం జరుగుతున్నట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. భారత్లో తొలిసారి చేపట్టిన హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఈ స్టేషన్ రూపొందుతోంది.

జపాన్ ప్రభుత్వ ఆర్థిక మరియు సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ను గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. ఈ రెండు నగరాలను కలుపుతూ దాదాపు 508 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ లైన్లు వేస్తుండగా.. కేవలం 2 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోనుంది.
ఈ మార్గంలో 26 కిలోమీటర్ల మేర సొరంగాలు, 10 కిలోమీటర్ల మేర వంతెనలు, ఏడు కిలోమీటర్లు మేర కరకట్టలు ఉండగా.. ఈ ప్రాజెక్టు(Bullet Train Project)కు రూ.1,08,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ స్టేషన్ నిర్మాణం మొత్తం 1.33 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు.

కాగా ఈ ఇంటర్నేషనల్ లెవెల్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ను జంట భవనాలుగా రూపొందించగా.. స్వాతంత్ర్య సమరంలో ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించిన సన్నివేశాల భారీ చిత్రాలను స్టేషన్కు అవతల గోడలపై పెయింట్ చేశారు. అంతే కాకుండా ఈ రైల్వే స్టేషన్లో ఆఫీస్లు, వాణిజ్య కార్యాలయాలు, రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది.
ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్ నగరాలను కలుపుతూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కొనసాగుతుండగా.. తదుపరి దశలో ఈ ప్రాజెక్టును విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీ - వారణాసి, ఢిల్లీ - అహ్మదాబాద్, ముంబయి - నాగ్పూర్, ముంబై - హైదరాబాద్, చెన్నై - మైసూర్, ఢిల్లీ - అమృత్సర్కు బుల్లెట్ రైలును నడిపే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇక ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కు సంబంధించి 2017 లో ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి జపాన్ ప్రధానమంత్రి షింజో అబేలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైలు వినియోగంలోకి వస్తే బుల్లెట్ రైలు ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరుతుంది.


Click it and Unblock the Notifications








