హైదరాబాద్కు త్వరలో 2 బుల్లెట్ ట్రైన్స్.. ఈ రూట్లలోనే పరుగులు..
దేశంలో త్వరలోనే తొలి బుల్లెట్ రైలు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ముంబయి- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్కు సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో రెండు బుల్లెట్ రైళ్లు త్వరలో రానున్నాయి. అది కూడా మన హైదరాబాద్ నుంచి ముంబయి, బెంగళూరు రూట్లలో. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.
ఇండియన్ రైల్వే ఇప్పటికే ముంబయి- అహ్మదాబాద్ రూట్లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు నడిపేందుకు సన్నద్ధమవుతోంది. హైస్పీడ్ ట్రైన్ లైన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే భారతీయ రైల్వే మరి కొన్ని రూట్లల్లో బుల్లెట్ ట్రైన్స్ నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

నేషనల్ రైల్ ప్లాన్లో మరిన్ని రూట్స్ ప్రతిపాదనలో ఉన్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభ వేదికగా వెల్లడించారు. ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ సర్వీసులుగా, ఎక్స్ప్రెస్ సేవలను సూపర్ఫాస్ట్ సర్వీసులుగా మార్చడం ద్వారా రైళ్ల సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఐఐటీ- బాంబే సహకారంతో శాస్త్రీయ పద్ధతిలో టైమ్ టేబుల్ను హేతుబద్ధీకరిస్తున్నామని తెలిపారు.
త్వరలో హైదరాబాద్ నుంచి ముంబయి, బెంగళూరుతో బుల్లెట్ రైలు కనెక్టివిటీ ప్రారంభం కానుంది. హై-స్పీడ్ రైల్ నెట్వర్క్ అభివృద్ధి దిశగా ముంబయి- హైదరాబాద్తో సహా ఏడు ప్రధాన మార్గాల్లో నేషనల్ రైల్ ప్లాన్ (ఎన్ఆర్పి) విస్తరిస్తుందని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

హై స్పీడ్ రైల్ నెట్వర్క్లో భాగంగా ఏడు ప్రధాన ట్రైన్ నెట్వర్క్లు ఢిల్లీ- వారణాసి, ఢిల్లీ- అహ్మదాబాద్, ఢిల్లీ- అమృత్సర్, మంబయి- హైదరాబాద్, ముంబయి- నాగ్పూర్, చెన్నై- మైసూరు మరియు వారణాసి- హౌరా వంటి ముఖ్యమైన మార్గాలు ఆ జాబితాలో ఉన్నాయి.
TOI నివేదిక ప్రకారం, ముంబయి- హైదరాబాద్ మధ్య 709 కి.మీ దూరాన్ని ఈ ప్రాజెక్టు కవర్ చేస్తుంది. ముంబయి- హైదరాబాద్ రూట్లో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ 2051 నాటికి పూర్తి అవుతుందని.. ఈ మేరకు ప్రాజెక్ట్ యొక్క సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఇప్పటికే ప్రాథమిక సన్నాహాలు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.

ప్రముఖ వాణిజ్య నగరాల మధ్య బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేయడమే ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రధా లక్ష్యం. NRPలోని హై-స్పీడ్ రైలు మాస్టర్ ప్లాన్ ప్రకారం, 2041 నాటికి హైదరాబాద్- బెంగళూరు మధ్య 618 కి.మీ దూరాన్ని కవర్ చేస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పూర్తవుతుందని అంచనా.
అయితే 2051 నాటికి చెన్నై నుంచి మైసూరు మీదుగా బెంగళూరును కలిపే నెట్వర్క్పై ఇప్పటికే పరిశీలనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జపాన్ ప్రభుత్వం నుంచి సాంకేతిక నైపుణ్యం మరియు ఆర్థిక సహకారంతో ముంబయి- అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
త్వరలో హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు మధ్య రెండు బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. అయితే, ఇవి అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో 20 ఏళ్లకుపైగా సమయం పట్టనుంది. అనుకున్న గడువు కన్నా ముందే రైళ్లను పట్టాలపైకి ఎక్కించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
విజన్ 2024లో భాగంగా మొత్తం 251 రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేపట్టింది భారతీయ రైల్వే శాఖ. ఇందులో 76 కొత్త లైన్లు, 19 గేజ్ కన్వర్షన్లు, 156 డబ్లింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 29,147 కిలో మీటర్లను కవర్ చేస్తుంది. రూ. 4.92 లక్షల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టుల్ని నిర్వహిస్తోంది రైల్వే శాఖ. అందులో 9,910 కిలో మీటర్ల ట్రాక్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications








