ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ జర్నీ.. బస్సులో నుంచి కిందపడి కండక్టర్ మృతి.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో
బతుకు బండిని లాగాలంటే ఏదో ఒక పనిచేసుకోక తప్పదు. అందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ కర్ణాటకలోని బాగల్కోట్ నుంచి బతుకుదెరువు కోసం మంగళూరుకు వచ్చి కండక్టర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి జీవితం విషాదకరమైన ముగింపు పలికింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.
కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. కద్రి కేపీటీ నుంచి ప్రయాణికులతో ఓ ప్రైవేట్ బస్సు అతివేగంగా వెళుతోంది. ఈ క్రమంలో కండక్టర్ ఫుట్బోర్డుపై నిలబడి ఉన్నాడు. అంతలో నంతూరు సర్కిల్ వద్ద డ్రైవర్ మలుపు తీసుకుంటుండగా ఫుట్బోర్డ్పై నిలబడి ఉన్న కండక్టర్ ఒక్కసారిగా కిందపడిపోయాడు.

కిందపడిన కండక్టర్ను అక్కడే ఉన్న స్థానికులు చూడగా.. అప్పటికే ఆయన తలకు తీవ్రగాయమైంది. వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అయితే తలకు బలమైన గాయం కావడంతో అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో కండక్టర్ మృతి చెందారు.
మృతుడు దుర్దైవి బాగల్కోట్కు చెందిన ఈరయ్యగా గుర్తించారు. సూరత్కల్ తాడంబైల్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కద్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. నిర్ణీత సమయంలో నిర్దేశించిన స్టేషన్కు చేరుకునేందుకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసి ఈ విధంగా బస్సులు నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇలా ఫుట్బోర్డ్పై కూర్చొని లేదా నిలబడి ప్రయాణించడం చాలా ప్రమాదకరం. బస్సు వేగంగా వెళుతున్నప్పుడు లేదా మలుపులు తిరుగుతున్నప్పుడు బస్సు అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు, ప్రయాణికులు లేదా బస్సు సిబ్బంది అదుపు తప్పి పడిపోయే అవకాశం ఉంది. ఇది ప్రాణాపాయం కావచ్చు. ప్రస్తుతం మంగళూరులో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.
రాష్ట్రంలో శక్తి యోజన అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలు ఫుట్బోర్డ్లపై ప్రయాణించడం ఎక్కువైపోయింది. తాజాగా గడగ్లో ఓ మహిళ సిటీ ట్రాన్స్పోర్ట్ బస్సు ఫుట్బోర్డ్పై ఓ చిన్నారిని తన ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీటు దొరకకపోవడంతో ఆ మహిళ ఈ పని చేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఆ మహిళ చిన్నారిని ఎత్తుకుని లోపలికి వెళ్లినట్లు సమాచారం.

అంతకు ముందు జూలై నెలలో హులిగి నుంచి కొప్పోలు వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఫుట్బోర్డ్పై ఓ వృద్ధుడు పసిపాపను ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చుని ప్రయాణించాడు. జూన్లో హవేరీ జిల్లాలో 14 ఏళ్ల బాలిక NWKRTC బస్సు నుండి కింద పడి మరణించింది. ఆ తర్వాత రాష్ట్ర రవాణా శాఖకు ఈ విషయంపై సమాచారం అందింది.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్టార్ట్ అయ్యే ముందు బస్సు డోర్లు మూసివేయాలని రవాణా సంస్థ సిబ్బందిని మంత్రి రామలింగారెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించి అనేక మార్గదర్శకాలతో సహా KSRTC ఒక సర్క్యులర్ను కూడా జారీ చేసింది. డిపోల నుంచి ట్రిప్ ప్రారంభించే ముందు బస్సు అన్ని డోర్లను తనిఖీ చేయాలి. ఫుట్బోర్డ్పై నిలబడి లేదా కూర్చున్నప్పుడు బస్సు కదలనివ్వకూడదు.. లేదా ప్రయాణికులు అక్కడి నుంచి లేవకూడదు.

ప్రయాణికుల భద్రత కోసం కర్ణాటక ప్రభుత్వం రవాణా బస్సుల్లో కొన్ని మార్గదర్శకాలను అమలు చేయడం శుభపరిణామం. ఇలాంటి నిబంధనలు ప్రైవేట్ బస్సులకు కూడా వర్తింపజేసి ఉంటే మంగళూరులో కండక్టర్ మృతి చెంది ఉండేవారు కాదు.. కనీసం ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications








