మళ్ళీ వెలుగులోకి వచ్చిన హెల్మెట్ రచ్చ.. కారులో వెళ్లే వ్యక్తికి హెల్మెట్ లేదని జరిమానా
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. రోజు రోజుకి దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి మరియు వాహన వినియోగదారులందరూ తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటించేలా చేయడానికి సంబంధిత ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

కారులో ప్రయాణించేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ఉపయోగించాలి, బైక్ రైడ్ చేసేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అనే నియమాలు ప్రస్తుతం చాలా వరకు అందరూ పాటిస్తున్నారు. అయితే వాహన వినియోగదారులు అప్పుడప్పుడూ తప్పులు చేసి దొరికిపోతే దానికి జరిమానాలు భారీగానే ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే, అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా అప్పుడప్పుడు జరిమానాలు విధించడంలో తప్పుడు కారణాలను చూపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి, కాగా ఇప్పుడు కూడా అలన్తి ఒక సంఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.

నివేదికల ప్రకారం, కేరళకు చెందిన సంజీవ్కుమార్ అనే వ్యక్తికి ఇటీవల ఛలాన చెల్లించాలని తన మొబైల్ కి మెసేజ్ వచ్చింది. అయితే ఆ మెసేజ్ చూసిన అతడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఎందుకంటే అతడు హెల్మెట్ ధరించలేదని ఈ కారణంగా రూ. 500 చెల్లించాలని మెసేజ్ వచ్చింది.

నిజానికి అతడు హెల్మెట్ ధరించలేదు, ఎందుకంటే అతడు కారులో ప్రయాణిస్తున్నాడు కాబట్టి. కారులో ప్రయాణించే వ్యక్తికి హెల్మెట్ అవసరం ఏముంటుంది. అయినప్పటికీ అతనికి వచ్చిన మెసేజ్ అతనిలో కొంత కంగారుని కలిగించింది. ఇది సంజీవ్కుమార్ కి మాత్రమే కాదు ఈ విషయం విన్న ఎవరైన తప్పకుండా ఆశ్చర్యపడాల్సిందే..!

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనంలో వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించవచ్చు. కానీ కారులో వెళ్లే వారికి జరిమానా విధించారు అంటే అతి విడ్డూరం అనే చెప్పాలి.

సంజీవ్ కుమార్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఆయనకు బైక్ లేదని, బైక్ రైడింగ్ చేయడం అసలే తెలియదని, అయినప్పటికీ తనకు రూ. 500 జరిమానా కట్టాలని మెసేజ్ వచ్చిందని మీడియాతో చెప్పుకొచ్చాడు. ఈ వార్త ప్రస్తుతం కేరళలో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు జరగటం ఇదే మొదటి సారి కాదు.

దీనిపైన స్పందించిన పోలీసులు సాంకేతిక లోపం వల్ల జరిగిన పొరపాటు అని మిన్నకుండిపోయారు. అంతే కాకుండా ఇటీవల ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని జరిమానా విధించిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఇది కూడా కేరళలోనే జరగటం విశేషం. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో ఎద్దులబండి మీద వెళ్లే వ్యక్తికి కూడా హెల్మెట్ లేదని జరిమానా విధించారు, ఇది ఉత్తరాఖండ్ లోని ఛబ్రాలో జరిగింది. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో సైకిల్ పైన వెళ్లే వ్యక్తికి కూడా హెల్మెట్ ధరించలేదని జరిమానా విధించారు. ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. ఇందులో ఆటోలో వెళ్లే వ్యక్తి హెల్మెట్ ధరించలేదని అతనికి కూడా జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు విన్న తరువాత ఏ వాహనం మీద వెళ్లినా హెల్మెట్ తప్పనిసరేమో అనిపిస్తుంది.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు కఠినంగా ట్రాఫిక్ నియమాలను అమలుచేయడం తప్పనిసరి. అయితే ఆటోలో వెళ్ళేవాడికి, కారులో వెళ్ళేవాడికి చివరకి సైకిల్ మీద వెల్లవాడికి కూడా హెల్మెట్ లేదని జరిమానా విధించడం ఎంతవరకు న్యాయమో వారే ఆలోచించాలి. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా పోలీసులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Source: Manoramaonline


Click it and Unblock the Notifications








